Share News

Gulf Employment: ఏజెంట్‌ మోసం.. గల్ఫ్‌లో నరకం..

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:12 AM

‘ఇంట్లో పరిస్థితులు బాగాలేక, కుమారుడికి మంచి చదువులు చదివిద్దామని ఆశపడి తణుకుకు చెందిన ఏజెంట్‌ సంజయ్‌ అనే వ్యక్తి ద్వారా రెండేళ్ల క్రితం ఒమాన్‌ రాజధాని మస్కట్‌కు వెళ్లాను. అక్కడ ఇంటి పని, పిల్లలను చూసుకునే పనికి కుదిరాను.

Gulf Employment: ఏజెంట్‌ మోసం.. గల్ఫ్‌లో నరకం..

  • కాలు విరిగినా యజమాని కనికరించలే

  • కొట్టి మరీ పనిచేయించుకున్నారు

  • గల్ఫ్‌ బాధితురాలు నిర్మల ఆవేదన

  • ఎట్టకేలకు స్వదేశానికి చేరిక

పంజాగుట్ట, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘ఇంట్లో పరిస్థితులు బాగాలేక, కుమారుడికి మంచి చదువులు చదివిద్దామని ఆశపడి తణుకుకు చెందిన ఏజెంట్‌ సంజయ్‌ అనే వ్యక్తి ద్వారా రెండేళ్ల క్రితం ఒమాన్‌ రాజధాని మస్కట్‌కు వెళ్లాను. అక్కడ ఇంటి పని, పిల్లలను చూసుకునే పనికి కుదిరాను. కొద్ది రోజులు బాగానే ఉన్నా తరువాత నుంచి యజమాని అఘాయిత్యాలు పెరిగిపోయాయి. తిండి కూడా సరిగ్గా పెట్టకుండా కొట్టి మరీ పనిచేయించేవారు. ఆఖరికి కాలు విరిగినా కనికరించలేదు’.. ఇదీ ఏపీలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గొల్లకుట్టివారి పాలేనికి చెందిన నిర్మల అనే బాధితురాలి ఆవేదన ఇది. బీసీ యువసేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీరామకృష్ణారెడ్డి సహకారంతో గల్ఫ్‌ చెర నుంచి బయట పడిన ఆమె.. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో కలిసి విలేకరులతో మాట్లాడారు.


ఏజెంట్‌ చేతిలో మోసపోవడం వల్లే ఇన్ని కష్టాలు అనుభవించానని నిర్మల చెప్పారు. ఈ క్రమంలో తాను కింద పడడంతో కాలు విరిగిందని, నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చూపించమని తమ యజమానిని వేడుకున్నా పట్టించుకోలేదని, పైగా కొట్టి మరీ పని చేయించుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చి ఒక గదిలో బంధించారని, అదే గదిలో ఉంటున్న మరో మహిళ సెల్‌ ఫోన్‌తో కుటుంబ సభ్యులకు తన గోడు తెలిపానని చెప్పారు. చివరికి బీసీ యువసేన నేత మురళీ రామకృష్ణా రెడ్డికి ఫోన్‌ చేయగా మస్కట్‌లో ఉంటున్న బొంతు నాగరాజు, రాజీ, తదితరులు అక్కడికి వచ్చి తనను విడిపించారన్నారు.


పాస్‌ పోర్ట్‌ లేకపోవడంతో భారత్‌ ఎంబసీతో మాట్లాడి సంబంధిత పత్రాలు సమకూర్చారని, బీసీ యువ ేసన ప్రతినిధులు, మస్కట్‌లో ఉన్న వారు సుమారు రూ.1.50 లక్షలు అందించగా, ఊర్లో ఉన్న ఇంటిని తనఖా పెట్టి తండ్రి రాంబాబు రూ. 50 వేలు పంపించడంతో తాను ఈ నెల 27న విమానంలో నగరానికి వచ్చినట్టు తెలిపారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లోని అనేక మంది ఏజెంట్ల మాయమాటలతో మోసపోయి గల్ఫ్‌లో నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. ఆ నరకం నుంచి బయటికి రావడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒమాన్‌ రాజధాని మస్కట్‌ నుంచి నిర్మలను కాపాడడం సంతృప్తినిచ్చినా, ఇంకా 15 మంది మహిళలు అక్కడ చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారిని ఇండియాకు రప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతలు సహకరించాలని కోరారు.

Updated Date - Jul 29 , 2024 | 04:12 AM