Share News

Heavy Rainfall: నేడు, రేపు భారీ వర్షాలు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:37 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Heavy Rainfall: నేడు, రేపు భారీ వర్షాలు..

  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 13.6 సెం.మీ. వర్షపాతం నమోదు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బుధవారం రాష్ట్రంలో 13.6, కూసుమంచి మండలంలో 10.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


15 మండలాల్లో భారీ వర్షాలు కురువగా, 172మండలాల్లో 1.5 నుంచి 6.5సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఉస్మాన్‌సాగర్‌(గండిపేట) జలాశయానికి 400 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఉస్మాన్‌సాగర్‌ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 242 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు 3,800 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో వాటర్‌బోర్డు అధికారులు ఒక గేటును అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.

Updated Date - Sep 26 , 2024 | 04:37 AM