Share News

Fourth City: నాలుగో నగరికి రయ్‌.. రయ్‌!

ABN , Publish Date - Aug 18 , 2024 | 02:54 AM

దిగ్గజ సంస్థల కార్యాలయాలతో అలరారుతూ.. భవిష్యత్‌లో లక్షలాదిమంది నివసించేలా.. కాలుష్య రహితంగా.. అత్యాధునిక రీతిలో నిర్మించనున్న నాలుగో నగరి (ఫోర్త్‌ సిటీ)కి అంతే స్థాయిలో ప్రత్యేక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.

Fourth City: నాలుగో నగరికి రయ్‌.. రయ్‌!

  • ప్రపంచంలోనే అతి పెద్ద రెండంతస్తుల ఫైఓవర్‌ మెట్రో

  • 18 కి.మీ మేర 200 అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం

  • కింద 10 వరుసల రోడ్డు.. దానిపై 6 లేదా 8 వరుసలు

  • వీటిపైన మెట్రో రైల్‌.. పూలింగ్‌ విధానంలో భూ సేకరణ

  • కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో రైలు

  • మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): దిగ్గజ సంస్థల కార్యాలయాలతో అలరారుతూ.. భవిష్యత్‌లో లక్షలాదిమంది నివసించేలా.. కాలుష్య రహితంగా.. అత్యాధునిక రీతిలో నిర్మించనున్న నాలుగో నగరి (ఫోర్త్‌ సిటీ)కి అంతే స్థాయిలో ప్రత్యేక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఔటర్‌ రింగు రోడ్డుకు అనుసంధానిస్తూ దీనిని నిర్మించేందుకు కసరత్తు సాగిస్తోంది. ముచ్చర్ల బేగరికంచెలో దాదాపు 14 వేల ఎకరాల్లో తలపెట్టిన నాలుగో నగరాన్ని.. న్యూయార్క్‌, దుబాయ్‌, సింగపూర్‌లను తలదన్నేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులోభాగంగా బహుళ విధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.


ఇప్పటికే స్కిల్‌ యూనివర్శిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం నిర్మించాలనిబీసీసీఐని కోరతామని అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు పలు పెద్దపెద్ద సంస్థలు కార్యాలయాల స్థాపనకు ఆసక్తిగా ఉన్నాయి. దీంతో కొత్త నగరికి ప్రత్యేక రవాణా వ్యవస్ధ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగపూర్‌లో ఇటీవల నిర్మించిన డబుల్‌ డెక్కర్‌ వయాడక్ట్‌ మెట్రోను నమూనాగా తీసుకుంది. ఈ కమ్రంలో సాధారణ రహదారిని పది వరుసల్లో నిర్మిస్తారు. దానిపైన ఎనిమిది లేదా ఆరు వరుసల రహదారి నిర్మాణం చేపడతారు. ఈ రెండింటిపైన మెట్రో లైన్‌ వస్తుంది.


  • రైతులకు న్యాయం చేస్తూ..

రావిర్యాల ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానిస్తూ 200 అడుగల వెడల్పుతో 18 కి.మీ. పొడవున రహదారి కోసం ప్రభుత్వం భూ సేకరణ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, భారీగా సేకరణ చేయాల్సి ఉండడంతో పూలింగ్‌ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి బేగరికంచె సభలో ప్రకటించారు. ఈ మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి భూమిని తీసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తం 300 ఎకరాలను సేకరించనున్నారు. వాస్తవానికి రహదారి నిర్మాణానికి సుమారు 200 ఎకరాలు అవసరం. ఇందులో 50 ఎకరాలు అటవీ భూమి. 150 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది. పూలింగ్‌ విధానం కాబట్టి.. భూములు కోల్పోయిన రైతులకు రోడ్డుకు ఇరువైపులా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీంతో రెట్టింపు భూమి.. అంటే 300 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంటుంది. భూములు కోల్పోతున్నవారికి పరిహారం కింద 40ు భూమిని కొత్తగా నిర్మించే రోడ్డుకు ఇరువైపులా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీనిని 50 శాతానికి పెంచాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువమంది రైతులు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.


డబుల్‌ డెక్కర్‌ వయాడక్ట్‌ మెట్రో పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందుతుంది. నాగపూర్‌లో వార్ధా రోడ్డుపై నిర్మించిన అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్‌ ఉన్న మెట్రో పొడవు 3.14 కిలోమీటర్లు. ఇది గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ఇక హైదరాబాద్‌ శివార్లలో నిర్మించే దాని పొడవు 18 కిలోమీటర్లు. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్దది అవుతుందని అధికారులు చెబుతున్నారు. రహదారికి ఇరువైపులా స్కైటవర్స్‌ నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రీన్‌ జోన్‌ను మల్టీపర్ప్‌సగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నిర్మిస్తున్న మెట్రో లైన్‌ను ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కనుంచి తీసుకువచ్చి రావిర్యాల వద్ద రెండంతస్తుల ఫ్లైఓవర్‌ మెట్రో లైన్‌కు కలుపుతారు. ఇందుకోసం రావిర్యాలలో ఓఆర్‌ఆర్‌పై భారీ ఫ్లైఓవర్‌ నిర్మించి రింగు రోడ్డు ఎగ్జిట్‌ రోడ్లకు కూడా అనుసంధానం చేస్తారు. ఈ ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటైతే విమానాశ్రయం, ఔటర్‌ రింగు రోడ్డు నుంచి అరగంటలోనే నాలుగో నగరికి చేరుకోవచ్చు.


  • ఔటర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు దాకా కనెక్టివిటీ

హైదరాబాద్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్‌ సిటీకి మెట్రో మార్గం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై శనివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎ్‌సరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌ శశాంకతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి రహదారి అనుసంధానత రూట్‌ మ్యాప్‌ను అధికారులు వివరించగా సీఎం పలు సూచనలు చేశారు.

Updated Date - Aug 18 , 2024 | 02:54 AM