Mahesh Kumar Goud: రాహుల్ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా కార్యాచరణ
ABN , Publish Date - Sep 13 , 2024 | 03:54 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన మహే్షకుమార్గౌడ్ తెలిపారు.
ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మహే్షకుమార్ గౌడ్ భేటీ
ఉప ఎన్నికలు రాకపోవచ్చన్న టీపీసీసీ కొత్త అధ్యక్షుడు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన మహే్షకుమార్గౌడ్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన తన కుటుంబసభ్యులతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాజాజీమార్గ్లోని నివాసంలో కలుసుకున్నారు. అనంతరం మహే్షకుమార్ గౌడ్ మాట్లాడుతూ ఖర్గే ఆశీర్వాదం కోసం వచ్చినట్లు తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఖర్గే సూచించినట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మారిన ప్రతిసారి కొత్త కమిటీలు ఏర్పడతాయని, కొత్త కమిటీల విషయంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కమిటీల ఏర్పాటులో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. న్యాయప్రత్యామ్నాయాలు చూస్తామని తెలిపారు. తమ పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నట్లు మహే్షకుమార్ గౌడ్ తెలిపారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరని, లోక్సభ ఎన్నికలలో ప్రజలు వారికి సున్నా స్థానాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను భావించడంలే దని, ఒక వేళ వచ్చినా ఆ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని మహే్షకుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అరికెపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్ఎస్ సభ్యుడని, నిబంధనల మేరకే పీఏసీ చైర్మన్ అయ్యారని అన్నారు. మరోవైపు ఎయిమ్స్ ఆస్పత్రిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి మహే్షకుమార్ గౌడ్ నివాళులు అర్పించారు.