Karnataka : ముస్లిం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం : కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-03-26T17:06:39+05:30 IST

రానున్న కర్ణాటక (Karnataka) శాసన సభ ఎన్నికల్లో గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్

Karnataka : ముస్లిం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం : కాంగ్రెస్
DK Shiv Kumar

బెంగళూరు : రానున్న కర్ణాటక (Karnataka) శాసన సభ ఎన్నికల్లో గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చింది. బీజేపీ (BJP) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను తొలగించి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీలోకి పంపించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది.

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు డీకే శివ కుమార్ (D K Shivakumar) ఆదివారం మాట్లాడుతూ, ఓబీసీ (OBC) కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఆస్తిని పంచినట్లుగా రిజర్వేషన్లను పంచవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. రిజర్వేషన్లు అనేవి ఓ ఆస్తి, సంపద కాదన్నారు. రిజర్వేషన్లను పొందడం మైనారిటీల హక్కు అని చెప్పారు. ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దవ్వాలని, వాటిని ప్రధాన సామాజిక వర్గాలకు పంపిణీ చేయాలని తాము కోరుకోవడం లేదన్నారు. మైనారిటీలు తమ సోదరులని, తమ కుటుంబ సభ్యులని చెప్పారు. తమకు ఇస్తామంటున్న ఈ రిజర్వేషన్లను వొక్కళిగలు, వీరశైవ-లింగాయత్‌లు తిరస్కరిస్తున్నారన్నారు. రానున్న 45 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఓబీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించడానికి ఎటువంటి ప్రాతిపదిక, ఆధారం లేవన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు తొలి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా చేస్తోందన్నారు.

రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

కర్ణాటక కేబినెట్ సమావేశం శుక్రవారం జరిగింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు శాతంలో రెండు శాతం రిజర్వేషన్లను వీరశైవ-లింగాయత్‌లకు, మరో రెండు శాతం రిజర్వేషన్లను వొక్కళిగ సామాజిక వర్గానికి పంపిణీ చేసింది. ఓబీసీ ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న 10 శాతం రిజర్వేషన్ల కేటగిరీలోకి పంపించింది.

అమిత్ షా వ్యాఖ్యలు

కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా (Amit Shah) ఆదివారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు. మైనారిటీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం కల్పిస్తున్నవి కాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలరైజేషన్ పాలిటిక్స్ కోసం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందని, ఆ కోటాను వొక్కళిగలకు, లింగాయత్‌లకు ఇచ్చిందని చెప్పారు. ఓటు బ్యాంకు కోసం దురాశతో కాంగ్రెస్ ఎన్నడూ స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకునే కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు. అదేవిధంగా హైదరాబాద్ విముక్తి దినోత్సవాలను కూడా నిర్వహించలేదన్నారు.

ఇవి కూడా చదవండి :

Hyper loop: చెన్నై-బెంగళూరు మధ్య హైపర్ లూప్?

rahul disqualification: దేశవ్యాప్తంగా రోడ్లపైకి కాంగ్రెస్ శ్రేణులు.. ఢిల్లీలో ప్రియాంక, ఖర్గే సహా అగ్రనాయకత్వం..

Updated Date - 2023-03-26T17:06:39+05:30 IST