Odisha train accident: ‘ఒడిశా రైలు ప్రమాదం’ ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!..

ABN , First Publish Date - 2023-06-03T16:32:11+05:30 IST

దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ‘ఒడిశా రైలు ప్రమాదం’ (Odisha rail Accident) ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని తేలింది.

Odisha train accident: ‘ఒడిశా రైలు ప్రమాదం’ ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!..

బాలాసోర్: దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపిన ‘ఒడిశా రైలు ప్రమాదం’ (Odisha rail Accident) ఘటనపై నిపుణుల బృందం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని ప్రాథమిక రిపోర్ట్ తేల్చింది. ఈ మానవతప్పిదం కారణంగానే గూడ్స్ ట్రైన్ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించిందని, 3 రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన లైన్ పాక్షికంగా తుప్పుపట్టి ఉందని నిర్ధారణ అయ్యింది.

రిపోర్ట్‌లో వెలుగుచూసిన నిజాలివే...

హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి పొరపాటున సిగ్నల్ రావడంతో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో బాలాసోర్‌లోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. పొరపాటును గమనించి ఆ వెనువెంటనే సిగ్నల్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ అప్పటికే ట్రైన్ లూప్‌ లైన్‌లోకి ప్రవేశించింది. ఫలితంగా అదే లైన్‌లో ఆగివున్న గూడ్స్‌ రైలుని కోరమండల్ వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్రత ధాటికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 కోచ్‌లు, బెంగళూరు-సూపర్‌ఫాస్ట్‌కు చెందిన 2 కోచ్‌లు రైళ్ల నుంచి విడిపోయి పక్క లైన్‌లో పడ్డాయి. సరిగ్గా ఇదేసమయంలో ఈ లైన్‌లో వెళ్తున్న బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉన్న కోచ్‌లను బలంగా ఢీకొట్టింది.

Untitled-4.jpg

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణమైనట్టు నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని దర్యాప్తు చేపట్టిన సీనియర్ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు జేఎన్ సుబుదీ, ఆర్‌కే బెనర్జీ, ఆర్‌కే పంజిరా, ఏకే మోహంతులతో కూడిన నలుగురు సభ్యుల బృందం చేతి రాతతో 2 పేజీల రిపోర్టును రైల్వేకి శనివారం సమర్పించింది. తమ పరిశీలనలు, బహనగర్ బజార్ రైల్వే స్టేషన్‌లోని సిగ్నల్ రూమ్ రికార్డులు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని వివరించింది.


కాగా... రైల్వే సేఫ్టీ కమిషనర్ ఏర్పాటు చేసిన సాంకేతిక దర్యాప్తు (టెక్నికల్ ఎంక్వైరీ) సమగ్ర రిపోర్ట్ వచ్చాకే అసలు కారణాలు తెలియనున్నాయని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు రైల్వేమంత్రిత్వశాఖ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక రెండు రైళ్లలోనూ స్లీపర్ కోచ్‌‌ల కంటే ఏసీ కోచ్‌లపై ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని రిపోర్ట్ తేల్చింది. మరోవైపు ఇంతటి ఘోరం నేపథ్యంలో ఈ లైన్‌లో రక్షణ కవచ్‌ ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా లూప్ లైన్ అనేది ఒక రైల్వే ట్రాక్. మెయిన్ లైన్ నుంచి రైలు దారి మళ్లించడం లేదా మెయిన్ ట్రాక్‌లోకి ప్రవేశపెట్టేందుకు దీనిని వినియోగిస్తుంటారు. సర్వీస్ లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా, ఇతర రైళ్లపై ఎలాంటి ప్రభావం పడకుండా దీనిని ఉపయోగిస్తుంటారు. ఇదిలావుండగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 290 దాటింది. ఇక గాయపడినవారి సంఖ్య 1000కి పెరిగింది.

Updated Date - 2023-06-03T16:43:12+05:30 IST