Share News

IPL Auction: ఆటగాళ్లకు వేలం డబ్బులేనా.. మ్యాచ్ ఫీజు కూడా ఇస్తారా?

ABN , Publish Date - Dec 20 , 2023 | 03:32 PM

IPL Auction: ఐపీఎల్‌ వేలంలో ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. టాప్ క్లాస్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. యంగ్ టాలెంట్‌పై కోట్లు కుమ్మరించాయి. దీంతో కొందరు యువ ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. అయితే ప్లేయర్ల శాలరీలు ఎలా ఉంటాయ్..? మ్యాచ్ ఫీజుల సంగతి ఏంటి? వేలం తర్వాత అభిమానుల్లో నోటి నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే..!

IPL Auction: ఆటగాళ్లకు వేలం డబ్బులేనా.. మ్యాచ్ ఫీజు కూడా ఇస్తారా?

ఐపీఎల్‌ వేలంలో ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. టాప్ క్లాస్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. యంగ్ టాలెంట్‌పై కోట్లు కుమ్మరించాయి. దీంతో కొందరు యువ ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. అయితే ప్లేయర్ల శాలరీలు ఎలా ఉంటాయ్..? మ్యాచ్ ఫీజుల సంగతి ఏంటి? వేలం తర్వాత అభిమానుల్లో నోటి నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే..! నిజానికి 2008లో ఐపీఎల్ మొదలైంది. ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తయ్యాయి. ఆటగాళ్ల జీతాలకు సంబంధించి బీసీసీఐ ముందుగానే కొన్ని నిబంధనలు రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారం.. వేలంలో ప్లేయర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయి. జట్టు అవసరాలు, ప్లేయర్ల టాలెంట్, స్టార్‌డమ్, గత రికార్డుల, భవిష్యత్ అవసరాలు.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని ఆక్షన్‌లో ఫ్రాంచైజీలు పోటీపడతాయి. తమ ఫ్రాంచైజీకి పర్‌ఫెక్టుగా సరిపోతాడనుకునే ప్లేయర్ల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. వేలంలో ఒక ఆటగాడిని దక్కించుకుంటే.. ఒక సీజన్‌కు కాంట్రాక్ట్ ఫిక్సయినట్టు లెక్క.

ఉదాహరణకు వేలంలో ఒక ప్లేయర్‌ను ఏదైనా ఫ్రాంచైజీ రూ.10 కోట్లకు కొనుగోలు చేసిందని అనుకుందాం. అప్పుడు ఒక సీజన్ మొత్తం ఆడినందుకు ఆ 10 కోట్ల రూపాయలు ప్లేయర్ అకౌంట్‌లోకి వెళ్తాయి. సీజన్ మొత్తం అందుబాటులో ఉంటేనే కాంట్రాక్ట్ మొత్తాన్ని ఆటగాడికి చెల్లిస్తారు. ఫ్రాంచైజీకి సంబంధించిన క్యాంప్‌లు, ప్రాక్టీస్‌ మ్యాచుల్లోనూ ప్లేయర్లు పాల్గొనాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా డబ్బులేమీ చెల్లించారు. వసతి, భోజనం ఖర్చులు మొత్తం ఫ్రాంచైజీ చూసుకుంటుంది. తుది జట్టులో ఉన్నా లేకపోయినా.. పూర్తి మొత్తం దక్కించుకోవడానికి టీమ్‌తో పాటు ట్రావెల్ కావాల్సి ఉంటుంది. ఏదైనా కారణాలతో సీజన్ మధ్యలోనే ఆటగాడు వెళ్లిపోతే మాత్రం.. మ్యాచ్‌ల వారీగా వేలంలో దక్కించుకున్న మొత్తాన్ని విభజిస్తారు. జట్టుతో ఉన్నప్పుడు ప్లేయర్ గాయపడితే మెడికల్ ఖర్చులను ఫ్రాంచైజీ చూసుకుంటుంది. జట్టుతో పాటే ఉన్న ప్లేయర్.. ఒక్క మ్యాచ్ ఆడకపోయినా పూర్తి మొత్తం దక్కుతుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌.. ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్.. ఇలా వివిధ విభాగాల కింద వచ్చే ప్రైజ్‌మనీ ప్లేయర్ల ఖాతాల్లోకే వెళుతుంది. ప్రత్యేకంగా మ్యాచ్ ఫీజు అంటూ ఏమీ ఉండదు.

అటు ఐపీఎల్‌లో స్పాన్సర్‌షిప్స్ ద్వారా వచ్చే మొత్తం ఫ్రాంచైజీలకే చెందుతుంది. అయితే నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటే ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చు. సాధారణంగా ఛాంపియన్‌, రన్నరప్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని కచ్చితంగా ప్లేయర్లకు పంచాలనే నిబంధన ఏమీ ఉండదు. అది ఫ్రాంచైజీ నిర్ణయం మీదే అధారపడి ఉంటుంది. వేలంలో ప్లేయర్ దక్కించుకునే మొత్తాన్ని కొన్ని ఫ్రాంచైజీలు ఒకేసారి చెల్లిస్తాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు విడతల వారీగా చెల్లిస్తాయి. స్పాన్సర్‌షిప్‌లు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని చూసుకుని.. ప్లేయర్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇస్తుంటాయ్. కొన్ని ఫ్రాంచైజీలు తొలి టీమ్ క్యాంప్‌లోనే చెక్‌లు ఇచ్చేస్తాయి. టోర్నీకి ముందు 15 శాతం.. టోర్నీ మధ్యలో 65 శాతం.. ఆ తర్వాత ఈవెంట్ ముగిసేలోగా మిగతా 20 శాతం కాంట్రాక్ట్ మొత్తాన్ని చెల్లించే ఫ్రాంచైజీలు కూడా ఉంటాయి. భారత ప్లేయర్లు ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్స్‌ ప్రకారం.. పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ ప్లేయర్లు కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సిందే. ఒక్కో విదేశీ ప్లేయర్‌ దక్కించుకునే మొత్తంలో 20 శాతాన్ని ఆయా బోర్డులకు బీసీసీఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆసీస్ ఆటగాడు రూ. 20 కోట్లు దక్కించుకున్నాడని అనుకుంటే.. అందులో 20 శాతం.. అంటే 4 కోట్ల రూపాయలను క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ చెల్లించాలి.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 20 , 2023 | 03:33 PM