Sathya Kumar: జగన్ ప్రభుత్వంలో ఏపీ 20 ఏళ్లు వెనుకబడింది
ABN , Publish Date - Jul 23 , 2024 | 09:42 PM
ప్రధాని మోదీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Sathya Kumar) ఈరోజు (మంగళవారం) లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసపు సంకెళ్లను ఏపీ తెంచుకుందని.. అభివృద్ధి పయనంలో ఇది మరిచిపోలేని రోజని ఉద్ఘాటించారు.
అమరావతి: ప్రధాని మోదీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Sathya Kumar) ఈరోజు (మంగళవారం) లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసపు సంకెళ్లను ఏపీ తెంచుకుందని.. అభివృద్ధి పయనంలో ఇది మరిచిపోలేని రోజు అని ఉద్ఘాటించారు.. రాష్ట్ర ప్రజల ప్రగతికి కేంద్ర సంపూర్ణ సహాయ సహకారాలు ఆశించామని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 2014 లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రయత్నాలను గత వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదని చెప్పారు. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దాదాపు 20 ఏళ్లు వెనుకబడిపోయిందన్నారు. రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేయడం, ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం అత్యంత దారుణమైన నష్టం మిగిల్చిందని తెలిపారు.
అమరావతి అభివృద్ధికి రూ.10,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని.. ఫలితంగా, చాలా భవనాలు, నిర్మాణాల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయని కానీ వీటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం విస్మరించి మూడు రాజధానులపేరుతో వికృత రాక్షస క్రీడకు తెరలేపిందని మండిపడ్డారు. ఫలితంగా ఆవిర్భవించి పదేళ్లు గడిచిన తర్వాత కూడా సరైన రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో, ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లడానికి ఇటు ఆంధ్రప్రదేశ్లో.. అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చాయని వివరించారు.
ఈ నేపథ్యంలో, 2024 -25 కేంద్ర బడ్జెట్లో రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్ల గణనీయమైన ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు అవసరమైనప్పుడు మరింత సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు అత్యంత సంతృప్తిని కలిగించిందని అన్నారు. అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేయడం రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని వివరించారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నరలోపే రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు కార్యరూపం దాల్చడం ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల త్వరితగతిన అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రం ప్రదర్శించిన నిబద్ధతకు ధన్యవాదాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.