Share News

Vijayasai Reddy: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదు

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:02 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదని రాజ్యసభలో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తెలిపారు. బడ్జెట్‌లో ఏపీకి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు.

Vijayasai Reddy: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదు
Vijayasai Reddy

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదని రాజ్యసభలో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తెలిపారు. బడ్జెట్‌లో ఏపీకి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. రాజ్యసభ సమావేశాల అనంతరం మీడియాతో విజయసాయి మాట్లాడుతూ... రూ. 15వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని... అదంతా రుణంగానే ఇస్తున్నారు...దానిపైన వడ్డీ కూడా ఏపీనే బరాయించాలని చెప్పారు.

ఏపీకి ఏదో ఇచ్చారని ఇండియా కూటమి ఎంపీలు కూడా చెబుతున్నారు.. అదంతా అబద్ధమని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఏపీకి అన్యాయం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందని వివరించారు. కేంద్రం నిధులు దోచుకోవడానికే పోలవరాన్ని చంద్రబాబు చేపట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.



బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం

మరోవైపు.. కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించింది. గతానికి భిన్నంగా మోదీ ప్రభుత్వం ఈసారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. నేరుగా ప్రజల్లో ఖాతాల్లో డబ్బులు వేసే సంక్షేమం కాకుండా.. పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా పలు పథకాలను రూపొందించింది. ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వాలనే థీమ్‌తో కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ తయారుచేసింది. ఈ బడ్జెట్‌పై దేశంలోని రాజకీయ పక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలు మాత్రం బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా లాభం కలుగుతుందా.. ఇక్కడి ప్రజలను మెప్పించేందుకే నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరును ఎక్కువసార్లు పలికారా అనే సందేహం చాలామందిలో నెలకొంది.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ నిధులను నేరుగా కేంద్రప్రభుత్వం అందిస్తుందా.. లేదా అప్పు రూపంలో రాష్ట్రానికి ఇస్తుందా అనే అనుమానం ఎక్కువమందికి కలుగుతోంది. ఎవరికి వారు దీనిపై విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. దేశంలో పరిస్థితుల ఆధారంగా మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను ఉపయోగిస్తారు. మరి అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 15వేల కోట్లు ఎలా ఇస్తుందనేది పెద్ద ప్రశ్న.. వరల్డ్ బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఈ ఏడాది 15వేల కోట్ల రూపాయిలను రుణం ఇప్పిస్తుంది.

Updated Date - Jul 25 , 2024 | 10:29 PM