Share News

AP Politics:ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలు.. చర్యలు తీసుకుంటే ఎదురుదాడి..!

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:26 PM

పేరుకు ప్రజాపాలన.. కానీ చేసింది మాత్రం ప్రజల సొమ్మును దోచుకోవడం.. పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చవకగా కొట్టేసి.. నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేయడం.. ఇది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాపాలన మాటున జరిగింది.

AP Politics:ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలు.. చర్యలు తీసుకుంటే ఎదురుదాడి..!
YSRCP

పేరుకు ప్రజాపాలన.. కానీ చేసింది మాత్రం ప్రజల సొమ్మును దోచుకోవడం.. పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చవకగా కొట్టేసి.. నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేయడం.. ఇది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాపాలన మాటున జరిగింది. ఒకటా.. రెండా.. 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం ఖరీదైన భూమిని ప్రభుత్వ ఆదేశాలతో అతి చవకగా కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేయగా.. మరికొన్ని చోట్ల భూములు ఆక్రమించి మరి పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేపట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అతి చవకగా భూములు లీజుకు తీసుకోవడం ఒక ఎత్తైతే.. అధికారంలో ఉండటంతో అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించారట. ఒక్క ప్రకాశంలో తప్పితే మిగతా ఏ జిల్లా కేంద్రంలోనూ అనుమతులు తీసుకోకుండా వైసీపీ కార్యాలయాల నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని భవనాల నిర్మాణం పూర్తికాగా.. మరికొన్ని భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలపై అధికారులు చర్యలు మొదలుపెడితే కక్ష కట్టారంటూ ప్రభుత్వంపై వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తాము ప్రభుత్వ భూముల్లో పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేశామని.. ఏవైనా తప్పులు జరిగి ఉండొచ్చని.. అయినంతమాత్రాన చర్యలు తీసుకుంటారా అంటూ కొంతమంది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తప్పులు చేశామని ఓ వైపు ఒప్పుకుంటూనే మరోవైపు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించడం కొంత విచిత్రంగా అనిపిస్తుందనే చర్చ జరుగుతోంది.

AP Politics: బయటపడుతున్న వైసీపీ దాష్టికాలు, దారుణాలు..


కార్యాలయాల పేరుతో..

సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ స్టేడ్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించుకునే కార్యాలయాన్ని కొంత విలాసవంతంగా నిర్మించుకుంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, నాయకులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు.. తరచూ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు దరఖాస్తు చేసుకుంటే అర్హత ఆధారంగా ప్రభుత్వం తక్కువ ధరకే భూమిని కేటాయిస్తే.. ఆ స్థలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అన్ని అనుమతులు తీసుకుని భవన నిర్మాణం చేపడతారు. అదే జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను తక్కువ విస్తీర్ణంలో సాధారణంగా ఓ నాలుగు గదులు ఉండేలా నిర్మాణం చేసుకుంటారు. కానీ వైసీపీ మాత్రం ప్రభుత్వ భూములను అతి చవకగా పొంది.. భారీ భవంతులను.. ఓ విధంగా ప్యాలెస్‌లను తలపించేలా జిల్లా స్థాయిలో కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. అధికారంలో ఉండటంతో ఏమి చేసినా చెల్లుతుందనేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణలు లేకపోలేదు. మరోవైపు 25 జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి ఎటువంటి అనుమతలు తీసుకోలేదు.

YCP: వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో వెలుగులోకి సంచలన విషయాలు..


తప్పని తెలిసినా..

అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూల్చేయాలి. వాస్తవానికి సాధారణంగా ఎవరైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు రెండు అంతస్తులకు అనుమతులు పొంది.. మూడు లేదా నాలుగు అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. నిర్మాణం తర్వాత రెగ్యులరైజ్ చేయించుకోవచ్చనే ఉద్దేశంతో కొంతమంది నిర్మాణం చేస్తారు. కానీ అది నిబంధనల ప్రకారం తప్పు. నిబంధనలు పాటించకుండా ఎవరైనా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిస్తే మున్సిపల్ అధికారులు భవనం నిర్మాణ దశలో ఉండగానే కూల్చేస్తారు. ఈ విషయం ఐదేళ్లపాటు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులకు తెలుసు. అయినాసరే అధికారం ఉండటంతో అధికారులు సైతం సైలెంట్ అయిపోయారు. దీంతో చాలా జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం పూర్తైంది. తీరా ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు తమ పని చేయడం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు. అధికారులు రూల్స్ ప్రకారం నడుచుకుంటుంటే.. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ ప్రభుత్వం తమపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు చేస్తోంది.

AP News: పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పై మంత్రి లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం


మొత్తం విలువ ఎంతంటే..

వైసీపీ తన పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం 26 జిల్లాలో 42.24 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టగా ఈ స్థలాల విలువ దాదాపు 678 కోట్ల రూపాయిలుగా తెలుస్తోంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ భూమిని చవకగా లీజుకు ఇచ్చేసింది. మరోవైపు వైసీపీ కార్యాలయాలు నిర్మాణం చేపట్టిన స్థలాలను గతంలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలాలు ఉన్నాయి. వైసీపీ కార్యాలయాల కోసం గత అనుమతులను జగన్ ప్రభుత్వం రద్దుచేసింది. రాబోయేది తమ ప్రభుత్వమనే ధీమాతో వైసీపీ నాయకులు చేసిన భూఅక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపైఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎంతోమంది స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతోనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


AP News: నెల్లూరులో మరో రాజప్రసాదం నిర్మించిన జగన్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 23 , 2024 | 03:06 PM