Share News

Chennai : విదేశాల్లో ఉద్యోగాలంటూ 200 కోట్ల మోసం

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:55 AM

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3,400 మంది వద్ద రూ.200 కోట్ల మేర మోసానికి పాల్పడిన నలుగురిని పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Chennai : విదేశాల్లో ఉద్యోగాలంటూ 200 కోట్ల మోసం

  • 9 రాష్ట్రాల్లో 3 వేలకు పైగా బాధితులు.. నలుగురి అరెస్టు

చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3,400 మంది వద్ద రూ.200 కోట్ల మేర మోసానికి పాల్పడిన నలుగురిని పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వెలువడిన ఓ ప్రకటన చూసిన పుదుచ్చేరి లాస్‌పేటకు చెందిన రమే్‌షకుమార్‌ మొబైల్‌ఫోన్‌లో అగంతకులను సంప్రదించాడు.

సదరు వ్యక్తి కెనడాలోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. వీసా, వైద్య పరీక్షలు, ఇన్సూరెన్స్‌ తదితరాల కోసమంటూ రూ.17.71 లక్షలు తీసుకున్నాడు. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాక ఏడాది గడిచినా అటు నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించిన రమే్‌షకుమార్‌.. పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

రెండు నెలలపాటు జరిగిన విచారణలో కోల్‌కతా కేంద్రంగా మోసం జరిగినట్టు గ్రహించారు. అక్కడకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శుభం శర్మ (29), నీరజ్‌ గుర్జార్‌ (28), వారి స్నేహితుడు బీహార్‌కు చెందిన దీపక్‌కుమార్‌ (28), యూపీ చెందిన రాజ్‌గౌండ్‌ (23) ఈ మోసానికి పాల్పడ్డారని, వారు ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నట్టు తెలుసుకుని శుక్రవారం ఆ నలుగురినీ అరెస్టు చేసి పుదుచ్చేరికి తరలించారు. శుభం శర్మ నేతృత్వంలోని ఈ ముఠా.. దేశవ్యాప్తంగా 3,400 మందికి పైగా విదేశీ ఉద్యోగాల పేరిట మోసం చేసినట్టు సమాచారం. వారి నుంచి 21 సెల్‌ఫోన్లు, 2 పాస్‌పోర్ట్‌లు, రూ.41 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 05:55 AM