Share News

MalliKarjun Kharge: నీట్‌ మార్కులు, ర్యాంకులపై సర్కార్‌ రిగ్గింగ్‌

ABN , Publish Date - Jun 15 , 2024 | 03:58 AM

నీట్‌ అక్రమాలు, పేపర్‌లీక్‌ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం నీట్‌ కుంభకోణాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఎన్‌టీఎ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నీట్‌ అక్రమాలపై ఆయన సర్కారును ఉద్దేశించి ‘ఎక్స్‌’లో ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘

MalliKarjun Kharge: నీట్‌ మార్కులు, ర్యాంకులపై సర్కార్‌ రిగ్గింగ్‌

24 లక్షల మంది ఆకాంక్షల్ని తొక్కేసింది

పేపర్‌ లీక్‌ కాకపోతే బిహార్‌లో 13 అరెస్టులు ఎందుకు?: ఖర్గే

యువత కలలపై దాడి: ప్రియాంక

‘చీట్‌’లా ‘నీట్‌’: జైరాం రమేశ్‌

ఎంట్రెన్స్‌ కుంభకోణాలకు చరమగీతం పాడదాం: తమిళనాడు సీఎం స్టాలిన్‌

సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంలో పిటిషన్లు

కేంద్రానికి, ఎన్‌టీఏకి నోటీసులు జారీ

మరి 13 అరెస్టులు ఎందుకు?

నీట్‌ పేపర్‌ లీక్‌ కాలేదన్న వ్యాఖ్యలపై ఖర్గే.. 24 లక్షల మంది యువత ఆకాంక్షల్ని తొక్కేశారని ధ్వజం

సీబీఐ దర్యాప్తు కోరుతూ ఏడు పిటిషన్లు

కేంద్రానికి, ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, జూన్‌ 14: నీట్‌ అక్రమాలు, పేపర్‌లీక్‌ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం నీట్‌ కుంభకోణాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఎన్‌టీఎ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నీట్‌ అక్రమాలపై ఆయన సర్కారును ఉద్దేశించి ‘ఎక్స్‌’లో ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘లక్షలాది మంది యువత, వారి తల్లిదండ్రుల ఆందోళనను పట్టించుకోకపోవడం ద్వారా.. వ్యవస్థలో ఎవరిని కాపాడడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నదే ప్రశ్న’’ అని ప్రియాంక ధ్వజమెత్తారు.

  • నీట్‌ కాదు.. చీట్‌

‘నీట్‌’ ఈ ప్రభుత్వ హయాంలో ‘చీట్‌ (సెంట్రల్‌ హైప్‌డ్‌ ఎంట్రన్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)’లా తయారైందని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ధ్వజమెత్తారు. మోదీ హయాంలో పరీక్షల పవిత్రత పదేపదే ప్రమాదంలో పడుతోందని.. పేపర్‌ లీక్‌లు సాధారణంగా మారిపోయాయని.. నీట్‌ పేపర్‌ లీక్‌ కుంభకోణం కూడా అలాంటివాటిలో ఒకటని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పాలనలో 40కి పైగా పేపర్‌ లీక్‌ ఘటనలు బయటపడ్డాయి. గుజరాత్‌ అయితే పేపర్‌ లీక్‌లకు రాజధానిగా మారింది. అక్కణ్నుంచే దేశం మొత్తానికీ పేపర్లు లీక్‌ అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌.. భారీ వ్యాపం కుంభకోణానికి పేరు మోసింది. ఇలాంటి అక్రమాలు లక్షలాది మంది యువ విద్యార్థుల ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయి’’ అని జైరామ్‌ రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. కాంగ్రెస్‌ మీడియా అండ్‌ పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్‌ ఖేడా అయితే నీట్‌ కుంభకోణాన్ని వ్యాప్యం 2.0గా అభివర్ణించారు. నీట్‌ అక్రమాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, కోర్టు కేసులు ఎవరో ప్రేరేపిస్తే జరుగుతున్నవంటూ కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలు.. 24 లక్షల మంది నీట్‌ అభ్యర్థుల పుండుపై కారం జల్లినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు.


అంతమంది యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన నిలదీశారు. ‘‘గత ఏడాది, ఈ ఏడాది నీట్‌ పరీక్షల్లో 580కి మించి స్కోర్‌ చేసిన విద్యార్థులందరి వివరాలూ బయటపెట్టాలి. వారు పరీక్ష రాసిన కేంద్రాల వివరాలను కూడా బహిర్గతం చేయాలి. అప్పుడు.. నీట్‌ పరీక్ష రాయడానికి ఎంత మంది విద్యార్థులు తాము ఉన్న చోటు నుంచి ఎంత దూరం ప్రయాణించారో బయటపడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. నీట్‌లో అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్‌ దర్యాప్తు చేయిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఇక.. నీట్‌ తరహా ప్రవేశపరీక్ష కుంభకోణాలకు తాము చరమగీతం పాడతామని, అది తమ బాధ్యత అని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. ‘‘నీట్‌లో అక్రమాలు జరిగాయని మొట్టమొదట చెప్పింది తమిళనాడే. ఇప్పుడు యావద్దేశం అదే మాట చెబుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • ఖర్గే ఎక్స్‌లో పోస్టు చేసిన ప్రశ్నలు

  • ‘‘నీట్‌ పేపర్‌ లీక్‌ కాకపోతే.. బిహార్‌లో 13 మంది నిందితులను ఆ ఆరోపణపై ఎందుకు అరెస్ట్‌ చేశారు? బిహార్‌లోని ఎడ్యుకేషన్‌ మాఫియా, పేపర్‌ లీక్‌ రాకెట్‌లో భాగమైన వ్యవస్థీకృత గ్యాంగులు నీట్‌ అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా వసూలు చేసిన విషయాన్ని పట్నా పోలీస్‌ శాఖలోని ‘ఆర్థిక నేరాల విభాగం’ బయటపెట్టలేదా?

  • గుజరాత్‌లోని గోధ్రాలో ఒక కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్న వ్యక్తి, ఒక టీచర్‌, మరొకరు కలిసి నడిపిన నీట్‌-యూజీ చీటింగ్‌ రాకెట్‌ గుట్టు రట్టు కాలేదా? ఈ ముగ్గురి మధ్య రూ.12 కోట్ల లావాదేవీలు జరిగిన విషయం బయటకు రాలేదా?

  • 24 లక్షల మంది రాత్రింబవళ్లూ శ్రమించి.. వైద్యవృత్తిలో ప్రవేశించడానికి నీట్‌ పరీక్ష రాశారు. మోదీ సర్కారు ఎన్‌టీఏని దుర్వినియోగం చేసి.. మార్కులు, ర్యాంకులను రిగ్గింగ్‌ చేసింది. అందుకే రిజర్వుడు సీట్లకు కూడా ఈసారి కటాఫ్‌ పెరిగింది. ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో రాయితీ ఫీజులకు సీట్లు పొందకుండా చేసేందుకే.. గ్రేస్‌ మార్కులు, పేపర్‌ లీక్‌, రిగ్గింగ్‌ ఆటలు ఆడినట్లు కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం 24 లక్షల మంది యువత ఆకాంక్షలను తొక్కేసింది.


  • సీబీఐ దర్యాప్తుపై మీ స్పందనేంటి?

నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపైన, పేపర్‌ లీక్‌ ఆరోపణలపైనా సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఎ)ని, సీబీఐని, బిహార్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా స్పందన తెలపాలని సీబీఐని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. మిగతావారికి తదుపరి విచారణ జరిగే జూలై 8 దాకా అందుకు సమయం ఇచ్చింది.

నీట్‌లో అక్రమాలు, పేపర్‌ లీక్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ మొత్తం ఏడు రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆ పిటిషన్లపై విచారణ జరిపింది. వాటిలో ముఖ్యమైనది.. నీట్‌-2024 అభ్యర్థులైన హితేన్‌ సింగ్‌ కాశ్యప్‌, పలక్‌ మిత్తల్‌ వేసిన పిటిషన్‌. పరీక్షా కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై వారు తమ పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. ఉదాహరణకు.. ఒడిసా, కర్ణాటక, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన 16 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి గుజరాత్‌లోని గోధ్రాలో ఉన్న ఒక పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్నారని తెలిపారు.

నీట్‌ పరీక్షలో మంచి మార్కుల కోసం వారు రూ.10 లక్షలు లంచంగా ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈమేరకు గుజరాత్‌ పోలీసులు ఒక టీచర్‌పై కేసు కూడా నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే.. నీట్‌ పేపర్‌ లీక్‌కు సంబంధించి పట్నా (బిహార్‌)లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన విషయాన్ని కూడా తమ పిటిషన్‌లో వివరించారు. యూపీలో నీట్‌ పేపర్‌ లీక్‌ రాకెట్‌కు సంబంధించిన ఒక రింగ్‌ లీడర్‌ ప్రమేయం ఉందంటూ యూపీలో వచ్చిన వార్తా కథనాల గురించి కూడా అందులో ప్రస్తావించారు. కాగా.. నీట్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌టీఎ వేసిన పిటిషన్‌పై కూడా ధర్మాసనం ఆయా ప్రైవేట్‌ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.

  • ఆ ఆత్మహత్యలకు నీట్‌తో సంబంధం లేదు

విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరు.. రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల గురించి ప్రస్తావించగా ధర్మాసనం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు నీట్‌ 2024 కాదన్న జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌.. ‘‘అనవసరంగా భావోద్వేగపరమైన వాదనలను ఇక్కడ వినిపించొద్దు’’ అని హెచ్చరించారు. ఇది 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని.. సీబీఐ దర్యాప్తు తప్పనిసరి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొనగా.. ఆ విషయం తమకు తెలుసని, కానీ ఎన్‌టీఎ వాదనలు వినకుండా ఈ విషయంలో ఎక్స్‌పార్టీ డిక్రీ (కక్షిదారు లేకుండా ఇచ్చే తీర్పు) ఇవ్వలేమని జస్టిస్‌ నాథ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Jun 15 , 2024 | 03:58 AM