Share News

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:53 AM

అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

  • తమిళనాడు సర్కారుకు హైకోర్టు నోటీసులు

చెన్నై, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అనారోగ్యం కారణంగా, 2016 సెప్టెంబరు 22వ తేదీ రాత్రి 10.25 గంటలకు అపోలో ఆసుపత్రిలో చేరిన జయ.. డిసెంబరు 5వ తేది రాత్రి 11.30 గంటలకు మృతిచెందినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో జరిగిన ఘటనలు పలు సందేహాలకు తావిస్తున్నాయని, అందువల్ల హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అన్నాడీఎంకే సభ్యుడు రామ్‌కుమార్‌ ఆదిత్యన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జయ మృతిపై ప్రకటన వెలువడక ముందే ఆమె శరీరానికి ఎంబ్లామింగ్‌కు సంబంధించి సూచనలిచ్చారని, జయ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం తప్పుడు సమాచారం ఇవ్వాల్సివచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ .. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Updated Date - Jul 16 , 2024 | 04:53 AM