Share News

Rohit Sharma: రోహిత్ శర్మనా మజాకా.. ఆ చారిత్రాత్మక రికార్డ్ పటాపంచలు

ABN , Publish Date - Jun 13 , 2024 | 02:59 PM

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగులేకుండా పోయింది. అఫ్‌కోర్స్.. అప్పుడప్పుడు ఆటగాడిగా అతను విఫలమవుతున్న మాట వాస్తవమే...

Rohit Sharma: రోహిత్ శర్మనా మజాకా.. ఆ చారిత్రాత్మక రికార్డ్ పటాపంచలు
Rohit Sharma Breaks Sourav Ganguly Record

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మకు (Rohit Sharma) తిరుగులేకుండా పోయింది. అఫ్‌కోర్స్.. అప్పుడప్పుడు ఆటగాడిగా అతను విఫలమవుతున్న మాట వాస్తవమే గానీ, సారథిగా మాత్రం దుమ్ముదులిపేస్తున్నాడు. భారత జట్టుకి కనీవినీ ఎరుగని విజయాలను అందిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుని అత్యధిక సార్లు గెలిపించిన రెండో కెప్టెన్‌గా చరిత్రపుటలకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా యూఎస్ఏపై భారత్ సాధించిన విజయంతో.. అతని ఖాతాలో ఈ రికార్డ్ చేరింది.


రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకూ 20 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 17 విజయాలను నమోదు చేసింది. ఈ క్రమంలోనే అతను భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. గంగూలీ సారథ్యంలో టీమిండియా 22 మ్యాచ్‌లు అడగా.. వాటిల్లో 16 విజయాలను అందించాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని రోహిత్ బ్రేక్ చేశాడు. అయితే.. ఈ జాబితాలో మాత్రం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అగ్రస్థానంలో ఉన్నాడు. అతని నాయకత్వంలో భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో 58 మ్యాచ్‌లు ఆడగా.. వాటిల్లో 41 విజయాలను ధోనీ అందించాడు. ఈ లెక్కన.. రోహిత్ ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. మరి ధోనీ రికార్డ్‌ని అతను బ్రేక్ చేయగలడా? లేదా? అనేది చూడాలి.


ఇదిలావుండగా.. భారత్ చివరిసారిగా ధోనీ సారథ్యంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ ఒక్క ఐసీసీ టైటిల్‌ని సాధించలేదు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌దాకా వెళ్లింది కానీ, చివర్లో బోల్తా కొట్టేసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి, టైటిల్‌ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో భారత్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసి, సూపర్-8కు అర్హత సాధించింది. మరి, ఇదే దూకుడుతో వరల్డ్‌కప్‌ను ముద్దాడుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.


ఐసీసీ ఈవెంట్స్‌లో భారత జట్టుకి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లు

* ఎంఎస్ ధోనీ (58) - 41

* రోహిత్ శర్మ (20) - 17

* సౌరవ్ గంగూలీ (22) - 16

* విరాట్ కోహ్లీ (19) - 13

* కపిల్ దేవ్ (15) - 11

* మహమ్మద్ అజారుద్దీన్ (25) - 11

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 02:59 PM