Share News

Hyderabad: వ్యవసాయ బడ్జెట్‌.. 64 వేల కోట్లు!

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:18 AM

రైతు సంక్షేమ పథకాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.64 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు తయారు చేసింది.

Hyderabad: వ్యవసాయ బడ్జెట్‌.. 64 వేల కోట్లు!

  • ఆర్థికశాఖకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు.. పంట రుణాల మాఫీకి రూ.31 వేల కోట్లు

  • ఒక్కో రైతు కుటుంబానికి 2 లక్షల మాఫీ

  • ‘రైతుభరోసా’కు రూ.23 వేల కోట్లు

  • పరిమితి విధించి పథకం అమలు!

  • పంటల బీమా పథకానికి 3 వేల కోట్లు

  • రైతు బీమాకు రూ.1,500 కోట్లు!

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమ పథకాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.64 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న రుణమాఫీ పథకానికి రూ.31 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.23 వేల కోట్లు, ఉచిత పంటల బీమా పథకానికి రూ.3 వేల కోట్లు, రైతుల బీమాకు రూ.1,500 కోట్ల నిధులు అవరసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు, ఇతర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంటు, ఉద్యోగుల వేతనాలు.. అన్నింటికీ కలిపి మరో రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని లెక్కించారు.


మొత్తమ్మీద ఏడాదికి రూ.64 వేల కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారుచేసి ఆర్థికశాఖకు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టబోయే పథకాల్లో వ్యవసాయశాఖకు సంబంధించినవే కీలకంగా ఉండడం గమనార్హం. ప్రధానంగా రూ.2 లక్షల రుణమాఫీ పథకానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సి వస్తోంది. ఇందుకోసం రూ.31 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల కేబినెట్‌ భేటీ తర్వాత రుణమాఫీ లెక్కలు వెల్లడించారు. ఈ క్రమంలో.. వచ్చే బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.31 వేల కోట్లకు ప్రతిపాదనలు పెట్టారు.


రైతు భరోసాకూ పెరుగుతున్న బడ్జెట్‌..

రైతుభరోసా పథకానికి కూడా బడ్జెట్‌ పెరుగుతోంది. గతంలో రైతుబంధు పథకంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.10 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు రైతుభరోసా పథకంలో ప్రతి సీజన్‌కు రూ.7,500 చొప్పున.. ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతుభరోసా ప్రారంభమవుతోంది. అయితే ఎకరానికి రూ.5 వేలు పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్‌ కూడా పెరుగుతోంది. గతంలో ఏడాదికి రూ.15 వేల కోట్ల నిధులు రైతుబంధుకు పెట్టేవారు. ఈ ప్రభుత్వం రూ.23 వేల కోట్ల బడ్జెట్‌లో పెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ పథకంలో ఇకపై పరిమితి విధించనున్నారు. గతంలో ఎంత భూమి ఉన్నా రైతుబంధు ఇవ్వగా.. ఇప్పుడు కటాఫ్‌ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ ప్రాతిపదికన అనర్హులను తొలగించాలన్న అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


ఇక రాష్ట్రంలో ఐదేళ్లుగా పంటలబీమా పథకం అమలు కావడంలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎం-ఎ్‌ఫబీవై)లో చేరింది. అయితే మెరుగైన పంటల బీమా అమలుచేసేందుకు కసరత్తు చేస్తోంది. రైతులపై ప్రీమియం భారం వేయకుండా.. ఉచితంగా క్రాప్‌ ఇన్సురెన్స్‌ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను రూ.3 వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. ఇక రైతులకు కూడా రూ.5 లక్షల బీమా పథకం గత ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతోంది. ఎల్‌ఐసీతో అనుసంధానమై రైతులకు బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతుల తరఫున ప్రీమియం చెల్లించేందుకు బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించడం గమనార్హం. వీటితోపాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిసింది.


ఈ సీజన్‌ నుంచే రూ.500 బోనస్‌..

ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే ‘బోనస్‌’ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. సన్నరకాలు సాగుచేసిన రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుంది? ఎంత సేకరిస్తారు? అనే దానిని బట్టి నిధులు అవసరమవుతాయి. టన్నుకు రూ.5 వేల చొప్పున.. ఎన్ని టన్నుల ధాన్యం సేకరిస్తే.. అన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం సన్నాల రైతులకు చెల్లించాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 25న వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.


కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్‌ గ్రాంటు ద్వారా వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, రాబోయే సీజన్‌కు పిలవాల్సిన క్రాప్‌ ఇన్సురెన్స్‌ టెండర్లపై చర్చించారు. రైతు సంక్షేమ, వ్యవసాయ పథకాలకు ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, తమ హామీలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్‌పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగానే వ్యవసాయశాఖ అధికారులు రూపొందించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థికశాఖకు సమర్పించారు.

Updated Date - Jun 27 , 2024 | 03:19 AM