Share News

JP Nadda: 15 రోజుల్లో.. 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం..

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:21 AM

రాబోయే 15 రోజుల్లో 40 లక్షల పార్టీ సభ్యత్వాల నమోదు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.

JP Nadda: 15 రోజుల్లో.. 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం..

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులను ప్రోత్సహించండి

  • రాష్ట్ర నేతలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాబోయే 15 రోజుల్లో 40 లక్షల పార్టీ సభ్యత్వాల నమోదు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తితో ఉన్న వారి నాయకత్వాన్ని ప్రోత్సహించి పార్టీ సభ్యత్వాలు సాధించాలని అన్నారు. హైడ్రా, రైతు సమస్యలపై ప్రజాపోరాటాలు చేస్తూనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో పార్టీ ముఖ్య నేతలతో శనివారం సమావేశమైన జేపీ నడ్డా.. పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యం కాగా ఇప్పటివరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని మిగిలిన 40 లక్షలను 15 రోజుల్లోగా పూర్తి చేసేలా పని చేయాలని నేతలను కోరారు.


ఈ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా నేతలు పని చేయాలని సూచించారు. యువతను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల పనుల్లో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఈ సమీక్షకు గైర్హాజరవ్వగా.. పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాగా, గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులల్లో సగం కంటే ఎక్కువ మంది ఈ సమావేశానికి దూరంగా ఉండడం గమనార్హం. అంతకముందు శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డాను బండి సంజయ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు స్వాగతించారు.

Updated Date - Sep 29 , 2024 | 03:21 AM