Share News

Devulapalli Prabhakar Rao: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా!

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:47 AM

ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాలకు సంబంధించిన అంశాల్లో తాను స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. నాటి పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లామని తెలిపారు.

Devulapalli Prabhakar Rao: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా!

  • ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి

  • విద్యుత్కేంద్రాలపై సొంత నిర్ణయాల్లేవ్‌

  • జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు తెలిపిన

  • ట్రాన్స్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు

  • జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు తెలిపిన ట్రాన్స్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాలకు సంబంధించిన అంశాల్లో తాను స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. నాటి పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లామని తెలిపారు. విద్యుత్తు అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి ఎదుట హాజరైన ప్రభాకర్‌రావు వివరణ ఇచ్చారు. ఆయనతో పాటు ఇంధన శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ చందా కూడా హాజరయ్యారు. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్‌ పద్ధతిలో ఛత్తీ్‌సగఢ్‌ డిస్కంల నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లకు 2014లో ఒప్పందం చేసుకోవడంతో పాటు అవసరానికి మంచి 2000 మెగావాట్ల విద్యుత్తు కారిడార్‌ (అంతర్రాష్ట్ర విద్యుత్తు సరఫరా లైన్లు) కోసం పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీజీసీఎల్‌)కు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ డిస్కమ్‌లను నాటి ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశించడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.


సమర్థవంతమైన సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీని పక్కనపెట్టి సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో మణుగూరు వద్ద భద్రాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం, ఓపెన్‌ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌కి బదులుగా నామినేషన్‌ పద్ధతిలో భద్రాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం వంటి నిర్ణయాలు దీర్ఘకాలంలో భారం కానున్నాయని, ఇక 179 నుంచి 388 కి.మీ.ల దూరంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గును తరలించి విద్యుదుత్పత్తి చేయడానికి నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో బొగ్గు రవాణా వ్యయం భారంగా మారనుందని రేవంత్‌ సర్కారు నిర్ణయానికి వచ్చింది. పోటీ బిడ్డింగ్‌కు బదులుగా నామినేషన్‌ పద్ధతిలో యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణ పనులను ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈ అంశాలన్నింటిపైనా వివరణ ఇవ్వాలని కోరుతూ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ ఇదివరకే ప్రభాకర్‌రావుతో పాటు కీలక అఽధికారులకు లేఖలు రాసింది. ఇప్పటికే లిఖితపూర్వకంగా సమాచారం అందించిన ప్రభాకర్‌రావు.. సోమవారం జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డితో సమావేశమై, వివరాలు తెలియజేశారు.

Updated Date - Jun 11 , 2024 | 03:47 AM