Share News

Mahabubnagar: కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి?

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:02 AM

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరుండడం, ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన నుంచి ఒత్తిడి వస్తుండటం, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రె్‌సలోకి వెళ్దామని చెబుతుండడంతో ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నట్లు తెలుస్తోంది.

Mahabubnagar: కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి?

  • చేరికపై కొనసాగుతున్న చర్చలు

  • స్థానిక సమీకరణాలపై కసరత్తు

  • నిర్ణయం తీసుకోలేదన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరుండడం, ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన నుంచి ఒత్తిడి వస్తుండటం, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రె్‌సలోకి వెళ్దామని చెబుతుండడంతో ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని షరతులు విధించడంతో.. ఆ విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చర్చలు సఫలమైతే వెంటనే ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోగా, గద్వాల జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అయితే, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి చెందడం, పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ గెలవడంతో సీఎం రేవంత్‌ను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఓ అవకాశం దక్కిది.


ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లాలో అందరూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉండాలన్న సంకల్పంతో పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడితోపాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని సంప్రదించినట్లు తెలిసింది. ప్రస్తుతం గద్వాల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కృష్ణమోహన్‌రెడ్డి మధ్య విభేదాలున్నాయి. ఆమె అదే పదవిలో ఉంటే తాను రాబోనని కృష్ణమోహన్‌రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కృష్ణమోహన్‌రెడ్డి చేరితే తన భవిష్యత్‌కు గ్యారంటీ ఇవ్వాలంటూ వేం నరేందర్‌రెడ్డి ద్వారా సీఎంను కలిసేందుకు సరిత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రాకపోతే చేరికలు నిలిచిపోయే అవకాశమూ ఉంది. అయితే, పార్టీ మారే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్‌ పెద్దలు ఒత్తిడి తీసుకువస్తున్నారని కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Jun 18 , 2024 | 07:57 AM