Share News

TS Politics: ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం... ఇంకారాని చైర్మన్ గుత్తా.. కేసీఆరే కారణమా?

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:48 PM

Telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరామ్, అమరుల్లా ఖాన్ ఈరోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపటి క్రితమే ఇరువురు నేతలు కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు.

TS Politics:  ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం... ఇంకారాని చైర్మన్ గుత్తా.. కేసీఆరే కారణమా?

హైదరాబాద్, జనవరి 29: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరామ్ (Kodandaram), అమరుల్లా ఖాన్ (Amrullah Khan) ఈరోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపటి క్రితమే ఇరువురు నేతలు కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల చేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) ప్రమాణం చేయించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కౌన్సిల్‌కు చైర్మన్ చేరుకోని పరిస్థితి. చాలా సేపటి నుంచి చైర్మన్ కోసం కోదండరాం, అమరుల్లా ఖాన్ కౌన్సిల్ హాల్‌లోనే ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) ఒత్తిడి మేరకే ప్రమాణం చేయించేందుకు చైర్మన్ ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. చాలా సేపటి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు మండలిలోనే వేచి చూస్తున్నారు. చైర్మన్ తీరుపట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్‌కు పంపగా.. అందుకు గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ఆమోదం తెలుపుతూ ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేశారు.


గవర్నర్ ఆమోదంపై బీఆర్‌ఎస్ విమర్శలు..

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. అయితే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వీరిద్దరి పేర్లను తిరస్కరించారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గత ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అనంతరం వారిద్దరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దాంతో ఆ రెండు స్థానాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.

అయితే ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లాఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రకటించడంపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. గవర్నర్ తీరును గులాబీ నేతలు తప్పుబట్టారు. కాంగ్రెస్‌, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయపటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) విమర్శలు చేశారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంతో ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మేలు చేసేలా గవర్నర్‌ తమిళిసై పనిచేస్తున్నారని ఆరోపించారు.

అలాగే గవర్నర్ నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్‌ (Former Minister KTR) కూడా తప్పుబట్టారు. కీలక నిర్ణయాల విషయంలో గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తే.. రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌ తిరస్కరించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

Updated Date - Jan 29 , 2024 | 03:58 PM