Share News

Revanth Reddy: రుణమాఫీపై రేవంత్ కీలక ప్రకటన.. పక్కాగా ఏమేం ఉండాలంటే..?

ABN , Publish Date - Jun 28 , 2024 | 07:20 PM

లంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి (Rythu Runa Mafi) రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆగస్టు-15 లోగా ఈ హామీని నెరవేరుస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే..

Revanth Reddy: రుణమాఫీపై రేవంత్ కీలక ప్రకటన.. పక్కాగా ఏమేం ఉండాలంటే..?

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి (Rythu Runa Mafi) రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆగస్టు-15 లోగా ఈ హామీని నెరవేరుస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా దాదాపు మొదలైంది. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) .. మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన సీఎం.. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని.. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి క్లియర్ కట్‌గా చెప్పేశారు. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని.. మరోసారి స్పష్టం చేశారు. బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావని కూడా సీఎం చెప్పేశారు. పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ ఉంటుందని రేవంత్ రెడ్డి ఒక్క మాటలో చెప్పేశారు.


CM-Revanth-Reddy.jpg

మార్పులు, చేర్పులు..!

కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’లో ఉన్న లోపాలు సరి చేసే పనిలో ఉన్నాము. ఆ తరవాత ఏ పేరు పెట్టినా నడుస్తుంది. కంప్యూటరైజ్ చేయాలా..? లేక మాన్యూవల్ పద్ధతి పాటించాలా..? రెండే పద్ధతులు. ఏది చేయాలో అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. ఏ పాలసీ అయినా... ముందు అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే మార్పు చేర్పులతో తుది విధానం ప్రకటన చేస్తాము. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పోస్టింగ్స్‌లో రూల్స్‌ బ్రేక్‌ చేయం. కేసీఆర్ చేసిన తప్పులను మేం చెయ్యంఅని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కరెంట్ కోతలు, ఆర్టీసీపై..!

రాష్ట్రంలో విద్యుత్ కోత లేదు పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చే సరికి ప్రతి సంవత్సరం జరిగే నిర్వహణ పనులు జరగడం వల్ల అంతరాయం ఏర్పడింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పాను. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడని అధికారులకు అదేశాలిచ్చాం. బడ్జెట్ వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించాల్సిన అవసరం లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెలా 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుంది. 30 శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. దీనివలన ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబందం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తుంది. మహిళల ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తోంది. దాని కారణంగానే.. ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. మహిళలకు ఉచిత రవాణా సదుపాయం వల్ల టెంపుల్ టూరిజం పెరిగింది. అక్కడ జీఎస్టీ కూడా పెరిగిందిఅని రేవంత్ చెప్పుకొచ్చారు.


వాట్ నెక్స్ట్..?

రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతు రుణమాఫీ తరువాత రైతు బంధు ఇతర పథకాల పై దృష్టి పెడతాం. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయం లో కమీషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాం. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తరువాత కమిషన్ నియమిస్తాం. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త వారిని నియమించిన తరువాత కుల గణన చేస్తాం. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తరువాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళతాం. రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మరో లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. నెలకు రూ. 7 వేల కోట్ల అప్పులు కడుతున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు 6500 కోట్లు కట్టేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నాం. కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. 7 నుంచి11 శాతం వడ్డీ వరకు రుణాలు తెచ్చారు. అవకాశం ఉన్నంత వరకు వడ్డీ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక శాతం వడ్డీ తగ్గినా నెలకు 700 కోట్ల భారం తగ్గుతుంది. కేంద్రంతో చర్చలు జరిపి రుణాలకు వడ్డీ తగ్గించే అంశం ఒక కొలిక్కి తీసుకొస్తాం. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి నుంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీకి డబ్బు తెచ్చిన అప్పులు తీర్చేస్తాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించాం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


ప్రశ్నించరేం..?

అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు, కేంద్ర మంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశారు. బడ్జెట్‌కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదు. అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలి. మోదీ 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరు ప్రశ్నించరు..? కానీ మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారుఅని ఉదహరించి మరీ రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. మహిళలకు పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు మహిళలకు పీసీసీ ఇస్తే బానే ఉంటుందని సీఎం సమాధానం ఇచ్చారు. విలేకరుల సూచనలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పీసీసీ రేసులో ఎవరైనా ఉండొచ్చని.. సామాజిక న్యాయంలో భాగంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీలు కూడా ఉండొచ్చన్నారు. ఫిరాయింపుల తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదని.. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఫిరాయించారన్న విషయాన్ని గుర్తు చేశారు.

For Latest News and Telangana News click here..


Updated Date - Jun 28 , 2024 | 07:20 PM