Share News

Khairatabad Ganesh: మెుదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..

ABN , Publish Date - Sep 17 , 2024 | 07:10 AM

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు.

Khairatabad Ganesh: మెుదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరుకు అన్నీ ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు భారీ ట్రక్కును తెప్పించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని ట్రక్కులోకి ఎక్కించారు. ఉదయం 6:15గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకూ పెద్దఎత్తున సాగనుంది. వందల, వేల మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే ఖైరతాబాద్‌కు చేరుకున్నారు.


మధ్యాహ్నం నిమజ్జనం..

ఇవాళ మంగళవారం కావడంతో అర్ధరాత్రే కలశపూజ అనంతరం గణనాథుణ్ని కదలించారు. అనంతరం శోభాయాత్రకు సిద్ధం చేశారు. మొత్తం రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర.. ఖైరతాబాద్ మీదుగా సెన్సేషనల్ థియేటర్, రాజ్‌దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్, NTR మార్గ్ వరకూ కొనసాగనుంది. NTR మార్గ్‌లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరగనుంది. హుస్సేన్ సాగర్‌లో ఇవాళ మధ్యాహ్నం 2గంటల కల్లా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.


విగ్రహం తయారీ ఇలా..

ఈ యేడాది బడా గణేశ్ విగ్రహం తయారీ ఆలస్యంగా ప్రారంభమైనా అనుకున్న సమయానికే పూర్తి చేసి ఏర్పాటు చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి బడా లంబోదరుణ్ని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ వినాయకుణ్ని పెట్టడం మెుదలుపెట్టి 70ఏళ్లు అయిన సందర్భంగా ఈ యేడాది 70అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి పూజలు అందుకున్నారు. కుడి వైపు శ్రీనివాస కల్యాణం, ఎడమ వైపు పార్వతీ కల్యాణంతో కనివిందు చేస్తున్నారు. భారీ విగ్రహం కాళ్ల వద్ద అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విగ్రహం బరువు సుమారు 40నుంచి 50టన్నుల వరకూ ఉంటుంది. విగ్రహం తయారీకి పెద్దఎత్తున ఐరన్, పీచు, మట్టి వినియోగించారు.


భారీ ఏర్పాట్లు..

మరోవైపు నగరవ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద గణేశ్ విగ్రహాలు అర్ధరాత్రి నుంచీ నిమజ్జనానికి తరలివస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. 75 పాండ్స్‌తో పాటు 5 చెరువుల వద్ద క్రేన్లను సిద్ధం చేశారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జెసీబీలు, 102 మినీ టిప్పర్లు సిద్ధంగా ఉన్నాయి. నిమజ్జన డ్యూటీలో 20వేల మందికి పైగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొంటున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లు సిద్ధం చేశారు. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 25వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు అన్ని నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని పోలీసులు సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Khairatabad Ganesh: కొనసాగుతున్న ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర

Jani Master: జానీ మాస్టర్ పోస్ట్ ఊస్ట్.. సంచలన నిర్ణయానికి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ రెడీ

Updated Date - Sep 17 , 2024 | 07:24 AM