Share News

KTR: విదేశాంగ మంత్రికి లేఖ రాసిన కేటీఆర్.. ఎందుకంటే..?

ABN , Publish Date - Aug 11 , 2024 | 09:19 PM

: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌కు (Jaya Shankar) లేఖ రాశారు. పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య(62) సమస్యను ఈ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.

KTR: విదేశాంగ మంత్రికి లేఖ రాసిన కేటీఆర్.. ఎందుకంటే..?
KTR

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌కు (Jaya Shankar) లేఖ రాశారు. పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య(62) సమస్యను ఈ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.

అండగా ఉంటా..

విదేశాంగ శాఖతో పాటు తెలంగాణ ప్రభుత్వం నర్సయ్య సమస్యకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. నర్సయ్యను భారతదేశానికి రప్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని, బహ్రెయిన్‌లోని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకుని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు. నర్సయ్య కుటుంబానికి తాను అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.


బహ్రెయిన్‌‌కు 28 ఏళ్ల క్రితం..

నర్సయ్య సమస్యను తన దృష్టికి అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు తీసుకువచ్చారని వెల్లడించారు. తాను వెంటనే స్పందించి విదేశాంగ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని అన్నారు. నర్సయ్యను భారత్‌కు రప్పించేందుకు అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని చెప్పారు. నర్సయ్య ఆచూకీ చాలా సంవత్సరాలుగా కనిపించకుండా పోయిందని అన్నారు. బతుకు దెరువు కోసం 28 ఏళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య అక్కడ చిక్కుకు పోయారని తెలిపారు. గత జనవరి నుంచి బహ్రెయిన్ జైల్లో ఉన్నాడని చెప్పారు. 1996లో బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య అక్కడి ‘ది అరబ్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ’ లో మూడేళ్ల పాటు తాపీ మేస్త్రీగా పనిచేశాడని వివరించారు. 1999 ఆగస్ట్‌లో నర్సయ్య వర్క్ పర్మిట్ ముగిసినా.. అక్కడే పనిచేస్తూ ఉన్నాడని చెప్పారు. ఆయన పాస్‌పోర్ట్ గడువు 2001లో ముగియటంతో బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ మళ్లీ రెన్యువల్ చేసిందని గుర్తుచేశారు.


బహ్రెయిన్ జైల్లో నర్సయ్య..

ఇప్పుడు ఆ పాస్‌పోర్ట్ గడువు కూడా ముగిసిందని , పాస్ పోర్ట్‌ను కూడా నర్సయ్య పొగొట్టుకున్నాడని చెప్పారు. వర్క్ పర్మిట్, పాస్ పోర్ట్ లేకపోవటంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడని బహ్రెయిన్ పోలీసులు నర్సయ్యను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అతనికు తాత్కాలిక పాస్‌పోర్ట్‌ను ఇప్పిచ్చే విషయంలో విదేశాంగ శాఖ చొరవ చూపాలని కోరారు. కేంద్ర విదేశాంగ శాఖతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి సహకారం అందించి ఆయనకు పాస్ పోర్ట్ త్వరగా జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నర్సయ్యను విడుదల చేసి ఇండియాకు పంపించాలంటే ఆయన భారతీయుడని తెలిపే ఆధారాలను బహ్రెయిన్ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు.


తాత్కాలిక పాస్‌పోర్ట్‌ కోసం..

నర్సయ్య గుర్తింపును ధ్రువీకరించాలని బహ్రెయిన్ ప్రభుత్వ సంస్థ 'లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ' 2024 జనవరి 8న బహ్రయిన్‌లోని భారత రాయబారికి లేఖ రాసిందని తెలిపారు. ఇప్పుడు నర్సయ్యకు భారత ప్రభుత్వం తాత్కాలిక పాస్ పోర్ట్‌ను జారీ చేస్తే బహ్రెయిన్ ప్రభుత్వం అతన్ని డిపోర్ట్ చేసి తిరిగి భారత్‌కు పంపించే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను పరిశీలించి నర్సయ్య చిరునామా కనుక్కొని సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల ద్వారా నివేదిక ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

Updated Date - Aug 11 , 2024 | 09:40 PM