Share News

DCP Vineeth: మోస్ట్ వాంటెడ్ 53కేసులు.. పది సార్లు జైలుకు..

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:00 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరస దొంగతనాలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కేటుగాటు నెహామియా అలియాస్ బ్రూస్లీని చివరికి కటకటాల వెనక్కి నెట్టారు.

DCP Vineeth: మోస్ట్ వాంటెడ్ 53కేసులు.. పది సార్లు జైలుకు..
Madhapur DCP Vineeth

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను నగర పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరస దొంగతనాలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కేటుగాటు నెహామియా అలియాస్ బ్రూస్లీని చివరికి కటకటాల వెనక్కి నెట్టారు. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10వ తేదీన ఓ ఇంట్లో చోరీ జరిగింది. దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుణ్ని అరెస్టు చేశారు.


మూడు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్..

నెహామియా అలియాస్ బ్రూస్లీ అనే దొంగ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. అయితే ఇప్పటికే ఇతనిపై మూడు రాష్ట్రాల్లో కలిపి మెుత్తం 53కేసులు వరకు ఉన్నాయి. చోరీలు చేస్తూ ఇప్పటికే 10సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒక రాష్ట్రంలో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు వేగవంతం చేస్తే మరో రాష్ట్రం వెళ్లి తలదాచుకునే వాడు. అలా మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే లక్షల సొత్తు చోరీ చేశాడు.


మాదాపూర్ డీసీపీ వినీత్ కథనం ప్రకారం..

నిందితుణ్ని పట్టుకున్న అనంతరం మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10న చోరీ జరిగినట్లు ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. సీసీ కెమెరాల ఆధారంగా చోరీ చేసింది మోస్ట్ వాంటెడ్ బ్రూస్లీగా గుర్తించాం. పక్కా పథకం ప్రకారం అతడిని అరెస్టు చేశాం. ఇతనిపై ఇప్పటివరకూ 53కేసులు ఉన్నాయి. పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఒకే సారి రెండు, మూడు ఇళ్లలో చోరీ చూసి వెళ్లిపోతుంటాడు. రాడ్లను ఉపయోగించి తాళం తీయడంలో నిందితుడు దిట్ట. మూడు కమిషనరేట్ల పరిధిలో బ్రూస్లీపై అనేక కేసులు ఉన్నాయి. ఇతడిపై పీడీ యాక్ట్ కూడా పెడతాం. 13కేసుల్లో నిందితుడికి కన్విక్షన్ కూడా వచ్చింది. అరెస్టు అనంతరం అతని నుంచి 25తులాల బంగారం, 300గ్రాముల సిల్వర్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ రూ.25లక్షల వరకూ ఉంటుంది. నిందితుడిపై ఇప్పటికే ఏపీలో 9, సికింద్రాబాద్‌- 2, సైబరాబాద్‌- 17, హైదరాబాద్-12, రాచకొండ- 6 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో మరో ఏడు కేసులు నమోదు అయ్యాయి. బ్రూస్లీతోపాటు కురువ నాగేశ్ అనే మరో వ్యక్తిని కూడా పట్టుకున్నాం. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాం" అని తెలిపారు.

Updated Date - Aug 16 , 2024 | 03:00 PM