Share News

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:05 AM

చెంచు మహిళను వివస్త్రను చేసి ఆమెపై పాశవికంగా దాడి చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు.

Nagarkurnool: చెంచు మహిళను పరామర్శించిన జూపల్లి..

  • రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి

  • రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : బీఆర్‌ఎస్‌

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): చెంచు మహిళను వివస్త్రను చేసి ఆమెపై పాశవికంగా దాడి చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళపై కౌలుదారులు దాడి చేసి అమానుషంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు మహిళను మంత్రి జూపల్లి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు.


ప్రభుత్వం అన్నివిధాలా బాధితురాలికి అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. మహిళపై దాడి చేసిన నలుగురు వ్యక్తులు అమానవీయంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించినట్లు వివరించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు మహిళకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ తరఫున రూ. 1.50లక్షల సహాయం అందజేశారు.

Updated Date - Jun 23 , 2024 | 03:06 AM