Share News

Gutha Sukender Reddy: నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు... చాలా కంఫర్ట్‌గా ఉన్నాను

ABN , Publish Date - Jan 23 , 2024 | 03:34 PM

తాను బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మారాల్సిన అవసరం లేదని.. చాలా కంఫర్ట్‌గా ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Gutha Sukender Reddy: నేను పార్టీ మారాల్సిన అవసరం లేదు... చాలా కంఫర్ట్‌గా ఉన్నాను

హైదరాబాద్: తాను బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మారాల్సిన అవసరం లేదని.. చాలా కంఫర్ట్‌గా ఉన్నానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసే ప్రజలు ఓట్లేస్తారని చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే తన కుమారుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదని.. ఈ కష్టకాలంలో పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూడు నాలుగు రోజుల్లో టికెట్‌పై ఓ క్లారిటీ వస్తుందన్నారు. మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొంత మందికి పార్టీపై అసంతృప్తి ఉండవచ్చని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన మంత్రులు కూడా భారీ తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఓటమికి వ్యక్తులు కారణం కారన్నారు. భువనగిరి, నల్గొండ ఎక్కడ టికెట్ ఇచ్చినా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

అయోధ్య వల్ల బీజేపీకి ఓట్లు పెరగవచ్చు

హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇందిరా గాంధీ మీద జైపాల్ రెడ్డి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నల్గొండలో సోనియా గాంధీ పోటీ చేస్తే అమిత్ రెడ్డి తనపై పోటీ చేస్తారని తేల్చిచెప్పారు. అయోధ్య అంశం తర్వాత బీజేపీకి కొన్ని ప్రాంతాల్లో ఓట్లు 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పోవడంతో తెలంగాణ ప్రయోజనాలకు భారీ నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు పోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 03:34 PM