Share News

Nalgonda: ప్రేమించా అన్నాడు.. చివరికి అత్యాచారం చేసి.. సంచలనం సృష్టించిన కేసు..

ABN , Publish Date - Sep 25 , 2024 | 07:55 PM

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, ఓ యువతి(19) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. మూడేళ్ల కాలంలో ఆమెను అతను అన్నీ విధాలుగా వాడుకున్నాడు.

Nalgonda: ప్రేమించా అన్నాడు.. చివరికి అత్యాచారం చేసి.. సంచలనం సృష్టించిన కేసు..

నల్గొండ: దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాలో సంచలనం సృష్టించిన యువతి హత్యాచారం కేసును వాడపల్లి పోలీసులు ఛేదించారు. ప్రియుడు, అతని బావ యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ప్రేమ పేరుతో ఆమెను శారీరకంగా వాడుకుని పెళ్లి ప్రస్తావన తేగానే నిందితుడు ముఖం చాటేశాడు. తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రియుడిని నిలదీసేందుకు వెళ్లిన ప్రియురాలిపై దారుణంగా అత్యాచారం చేసి ప్రాణాలు తీశారు. ఈనెల 14న జరిగిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రియుడు, అతని బావ, ప్రియుడి తల్లిని నిందితులుగా గుర్తించి కటకటాల వెనక్కి నెట్టారు.


అసలేం జరిగిందంటే?

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, ఓ యువతి(19) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. మూడేళ్ల కాలంలో ఆమెను అతను అన్నీ విధాలుగా వాడుకున్నాడు. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. అయితే యువతి ఇటీవల పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీంతో అతను గత కొన్ని రోజులుగా ఆమెకు ముఖం చాటేస్తూ వచ్చాడు. వదిలించుకునేందుకు ఫోన్ నంబర్లు సైతం బ్లాక్ చేశాడు. దీంతో విసుగు చెందిన యువతి ఈనెల 14న రాత్రి నేరుగా ప్రియుడి గ్రామం పుట్టలగడ్డకు వచ్చింది. తమ ప్రేమ వ్యవహారం ప్రియుడి తల్లి బుజ్జికి తెలిపింది. ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరింది. దీంతో యువతిపై బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసేందుకు నిరాకరించింది.


యువతి నేరుగా ఇంటికి రావడంతో కంగుతిన్న ప్రియుడు నాగు ఆమెతో తనకు ఎప్పటికైనా ప్రమాదమని భావించాడు. ఆమెను వదిలించుకునేందుకు బావ క్రాంతి కుమార్‌తో కలిసి పథకం వేశాడు. హైదరాబాద్ బయలుదేరిన యువతికి మంచి మాటలు చెప్పి ప్రియుడు, బావ, తల్లి ఆమెను పుట్టలగడ్డ తండా సమీపం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ యువతిపై నిందితులు నాగు, క్రాంతి కుమార్ అత్యాచారం చేశారు. క్రాంతి కుమార్ లైంగిక దాడి చేస్తుంటే నాగు, బుజ్జి కాపలా ఉన్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అనంతరం ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు.


యువతి మృతిచెందిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడే ఉన్న చెట్టుకు అదే చున్నీతో వేలాడ దీసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉదయాన్నే యువతి మృతదేహాన్ని చూసి గ్రామస్థులకు తెలియజేశారు. ఆ నోట ఈ నోట చేరి హత్య ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతిని ప్రియుడు రూపావత్ నాగు, రమావత్ క్రాంతి కుమార్, బుజ్జి హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు ముగ్గురినీ ఇవాళ(బుధవారం) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు.

Updated Date - Sep 25 , 2024 | 07:56 PM