Share News

Revenue targets: ఖజానా నిండాల్సిందే!

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:27 AM

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు.

Revenue targets: ఖజానా నిండాల్సిందే!

  • నిర్దేశిత వార్షిక రాబడుల లక్ష్యాలను సాధించాలి

  • ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి

  • జూన్‌ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు!

  • పన్ను ఎగవేతలు లేకుండా చూడండి

  • రిజిస్ట్రేషన్ల రాబడి పెరిగే చర్యలు చేపట్టండి

  • శాఖల లక్ష్యాలపై ప్రతి శుక్రవారం భట్టి సమీక్ష

  • ప్రతి నెలా తొలి వారంలో నేను సమీక్షిస్తా: రేవంత్‌

  • కలెక్టర్లు, ఎస్పీలతో త్వరలో సీఎం సమావేశం!

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పన్ను ఎగవేతలు లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. వార్షిక లక్ష్య సాధనకు వీలుగా ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని సూచించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని, ఆదాయాన్ని రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.


గురువారం సచివాలయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, మైనింగ్‌, రవాణా విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పొందుపర్చిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఆర్థిక మంత్రి భట్టి ప్రతి శుక్రవారం సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు.


జీఎస్టీని పెంచుకునే చర్యలు చేపట్టండి

ప్రధానంగా రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడిని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్‌ సూచించారు. జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్‌ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించకుండా పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమాన ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎన్నికలప్పుడు మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేర ఆదాయం పెరగకపోవడానికి కారణం ఏంటని సీఎం ప్రశ్నించారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. డిస్టిలరీల నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం ఆదేశించారు.


రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా పుంజుకుంటాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల ధరలు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించేందుకు పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయడం ద్వారా వాహనాల అమ్మకాలపై ప్రభావం పడిందా అన్న విషయమై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.


కలెక్టర్లు, ఎస్పీలతో త్వరలో సీఎం సమావేశం!

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధామ్యాలతో పాటు పథకాల అమలుకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎం రేవంత్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే అధికారులతో సమావేశమవ్వాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారుల బదిలీలు దాదాపు పూర్తవ్వడంతో ఇటు రాష్ట్రస్థాయితో పాటు అటు జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు వచ్చారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వ ఉద్దేశాలు, ప్రజల సమస్యల పరిష్కారాలకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవలంబించాల్సిన అంశాలపై అధికారులతో లోతుగా చర్చించనున్నట్లు తెలిసింది. పాలనాపరమైన అంశాలపైనా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడనున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల నిర్వహణ, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశాన్ని ఆన్‌లైన్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారా? లేదా అధికారులను హైదరాబాద్‌కు పిలిపిస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Jul 12 , 2024 | 03:27 AM