Share News

Bhatti Vikramarka: ప్రజాధనం వృధా కావొద్దు..

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:47 AM

రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Bhatti Vikramarka: ప్రజాధనం వృధా కావొద్దు..

  • రైతుభరోసా సాయంపై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు విధించలేదు

  • చట్టసభల్లో చర్చించాకే జీవో: డిప్యూటీ సీఎం భట్టి

  • చిన్న, సన్నకారుకు సక్రమంగా సాయం: తుమ్మల

  • నాలుగు గోడల మధ్య నిర్ణయాలు ఉండవు: పొంగులేటి

ఆదిలాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాధనం వృధా కావొద్దని, అసలైన రైతులకే పెట్టుబడి సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో రైతు భరోసా పథకం విధి విధానాల ఖరారుపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, రైతు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా, విలేకరుల సమావేశంలోనూ భట్టి మాట్లాడుతూ.. రైతుభరోసా సాయంపై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు విధించలేదని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం చట్టసభల్లో ప్రతిపక్షాలతో చర్చిస్తామని, ఆ తర్వాత విధివిధానాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని వెల్లడించారు. రైతుల నుంచి సూచనలు తీసుకోవడానికి సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి పది జిల్లాలను సందర్శిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రకటించారు. గ్రామం యూనిట్‌గా తీసుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. పోడు రైతులకు ప్రభుత్వ సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.


మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతుభరోసా సాయం ఇకపై అనర్హులకు అందదని స్పష్టం చేశారు. చిన్న సన్నకారు రైతులకు సక్రమంగా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో అనర్హులకు రైతుబంధు దక్కిందని, నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో నాలుగు గోడల మధ్య ప్రభుత్వ నిర్ణయాలు ఉండవన్నారు. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యనే నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజావ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. అందుకే రైతుల సలహాలు, సూచనల మేరకే రైతుభరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలతో చర్చించి రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు.


ప్రజాధనాన్ని వృధా చేయం: సీతక్క

తమపై ఎంతో నమ్మకం ఉంచి ప్రజలు అధికారం ఇచ్చారని, ప్రతిపైసా ప్రజలకే దక్కేలా ప్రభుత్వం చర్య లు చేపడుతున్నదని మంత్రి సీతక్క అన్నారు. వ్యవసా యం చేసినోడికే పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 04:47 AM