Share News

Hyderabad: పీసీసీ చీఫ్‌పై కసరత్తు కొలిక్కి!

ABN , Publish Date - Jun 29 , 2024 | 02:57 AM

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపైశుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సుదీర్ఘంగా చర్చించారు.

Hyderabad: పీసీసీ చీఫ్‌పై కసరత్తు కొలిక్కి!

  • మహేష్‌కుమార్‌గౌడ్‌ లేదా బలరాంనాయక్‌!

  • మంత్రివర్గ విస్తరణలో నలుగురికి చాన్స్‌?

  • అయితే మహేష్‌కుమార్‌గౌడ్‌..లేదంటే బలరాంనాయక్‌!

  • కొత్త మంత్రులుగా నలుగురికి చాన్స్‌?

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపైశుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ చీఫ్‌ నియామకానికి సంబంధించి మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీగౌడ్‌, సురేశ్‌ షెట్కార్‌, బలరాంనాయక్‌, సంపత్‌కుమార్‌ పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం. లోతైన విశ్లేషణ తర్వాత రేసులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎంపీ బలరాం నాయక్‌ పేర్లు మిగిలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసేట్లయితే వివాద రహితుడు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమగ్ర అవగాహన ఉన్న వాడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎస్టీ (లంబాడా)లకు చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచి బలరాం నాయక్‌కు టీపీసీసీ చీఫ్‌గా అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. రేవంత్‌, భట్టి, ఉత్తమ్‌, మున్షీల అభిప్రాయాలను పరిశీలించి.. అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణపైనా లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో సామాజిక కూర్పు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యాలను పరిగణనలోకి తీసుకుని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న సీఎం హామీ మేరకు పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, నిజామాబాద్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, ఎడ్మ బొజ్జులపైనా చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్‌ ఎంపిక ఆధారంగా సామాజిక సమీకరణలు చూసుకుని మిగిలిన మంత్రి పదవులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి లేదా రెండు బెర్తులు పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 29 , 2024 | 02:57 AM