Share News

Yadagirigutta: ‘గుట్ట'పై పుణ్య స్నానాలకు ఓకే..

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:51 AM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం దంపతులు, భక్తులకు రూ.500 టికెట్‌ ధర నిర్ణయించి ఆర్జిత సేవల జాబితాలో చేర్చనుంది.

Yadagirigutta: ‘గుట్ట'పై పుణ్య స్నానాలకు ఓకే..

  • 11 నుంచి అందుబాటులోకి విష్ణు పుష్కరిణి.. దంపతులు, భక్తులకు రూ.500 టిక్కెట్‌

  • గిరి ప్రదక్షిణ భక్తులకు ఉచిత ప్రవేశం.. టికెట్‌ తీసుకోనివారు నీళ్లు చల్లుకోవచ్చు

యాదాద్రి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం దంపతులు, భక్తులకు రూ.500 టికెట్‌ ధర నిర్ణయించి ఆర్జిత సేవల జాబితాలో చేర్చనుంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు కొండపైన విష్ణు పుష్కరిణి(కొండపైన గుండం)లో స్నానం ఆచరించడం ఆచారంగా వచ్చేది.


ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండ కింద లక్ష్మీ పుష్కరిణిని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిని స్వామివారి కైంకర్యాల కోసం మాత్రమే వినియోగిస్తున్నారు. సంతానం కలగని దంపతులు స్వామివారి సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసిన పక్షంలో సంతానం కలుగుతుందని విశ్వాసం. ఆ ఆచారాన్ని పునరుద్ధరించి విష్ణు పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు అవకాశం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


పుష్కరిణిలో నీటిని నింపి ఈ నెల 11న స్వాతి నక్షత్రం రోజున ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులోకి తేనున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు విష్ణు పుష్కరిణిలో ఉచితంగా స్నానాలు ఆచరించేందుకు అనుమతిస్తున్నట్లు ఈవో తెలిపారు. గిరి ప్రదక్షిణ చేయని, టికెట్‌ కొనుగోలు చేయని భక్తులు పుష్కరిణి నీటిని తలపై చల్లుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరిణిలోకి చెత్తా చెదారం చేరకుండా, కోతులు దూకకుండా, భక్తులకు పరిశుభ్రమైన నీటిని అందించేందుకు.. స్నానం ఆచరించిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయనున్నారు.


  • పాత ఆచారాల పునరుద్ధరణ..

కొండపైన రాత్రి బస చేసేందుకు డార్మెటరీ హాల్‌, కొబ్బరికాయలు కొట్టే స్థలం, గిరి ప్రదక్షిణ వంటి పాత ఆచారాలను ఇప్పటికే పునరుద్ధరించారు. 2016లో గత ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం చేపట్టగా.. కొండపైన ఇతర నిర్మాణాలు లేకుండా వైటీడీఏ మాస్టర్‌ ప్లాన్‌లో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ఉద్ఘాటన త్వాత కొండపైన పాత ఆచారాలను అధికారులు రద్దు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పాత ఆచారాల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 03:51 AM