Share News

India vs Pakistan: అదృష్టం అంటే పాకిస్థాన్‌‌దే.. క్యాచ్ పట్టకపోయినా..

ABN , First Publish Date - 2023-12-11T11:38:21+05:30 IST

Asia Cup 2023: భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, ఆడేది సీనియర్ జట్లైనా, జూనియర్ జట్లైనా మంచి ఆదరణ లభిస్తుంటుంది.

India vs Pakistan: అదృష్టం అంటే పాకిస్థాన్‌‌దే.. క్యాచ్ పట్టకపోయినా..

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా, ఆడేది సీనియర్ జట్లైనా, జూనియర్ జట్లైనా మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఏ స్థాయిలో ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. లక్షకు పైగా సిట్టింగ్ సామర్థ్యం ఉన్న మోదీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడ్డాయి. కానీ ఈ సారి సీనియర్లు జట్లు కాదు. జూనియర్ జట్ల వంతు. దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ క్యాచ్ విషయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా అండర్ 19 జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఎడమ చేతి బ్యాటర్ ఆదర్శ్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ అండర్ 19 జట్టు బౌలర్ అరాఫత్ మిన్హాస్ 32వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని టీమిండియా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ మిడ్ వికెట్ వైపు ఆడేందుకు ప్రయత్నించాడు.


అయితే బ్యాట్‌కు అండర్ ఎడ్జ్ తీసుకున్న బంతి పాకిస్థాన్ వికెట్ కీపర్ సాద్ బేగ్ ప్యాడ్‌ల మధ్యలో ఇరుక్కుపోయింది. వికెట్ కీపర్ చేతులతో క్యాచ్ పట్టుకోకపోయినా అతడి కాళ్ల మధ్యలో ఇరుక్కుని కింద పడకుండా అలాగే ఉండిపోయింది. దీంతో పాకిస్థాన్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఆదర్శ్ సింగ్ ఔటైనట్టుగా అంపైర్ ప్రకటించాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదృష్టం అంటే పాకిస్థాన్‌దే అని, క్యాచ్ పట్టకపోయినా బంతి ప్యాడ్‌ల మధ్యలో చిక్కుకోవడంతో వికెట్ లభించిందని అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి క్యాచ్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ రాసుకొస్తున్నారు. ఇలాంటి క్యాచ్ మరెక్కడా చూడలేదు అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ క్యాచ్‌తో హాఫ్ సెంచరీతో క్రీజులో కుదురుకున్న కీలకమైన ఆదర్శ్ సింగ్ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. 142 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఆదర్శ్ సింగ్(62), ఉదయ్ సహారన్(60), సచిన్ దాస్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. వన్‌డౌన్ బ్యాటర్ అజాన్ అవైస్(105) అజేయ సెంచరీ, సాద్ బేగ్(68) అజేయ హాఫ్ సెంచరీ, షాజైబ్ ఖాన్(63) హాఫ్ సెంచరీతో రాణించడంతో లక్ష్యాన్ని పాకిస్థాన్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T11:43:07+05:30 IST