Share News

IPL 2024 Auction: వేలంలో పంజాబ్ కింగ్స్ పొరపాటు.. ఒక ఆటగాడికి బదులు మరొకరిని..

ABN , Publish Date - Dec 20 , 2023 | 02:08 PM

Preity Zinta: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్‌లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

IPL 2024 Auction: వేలంలో పంజాబ్ కింగ్స్ పొరపాటు.. ఒక ఆటగాడికి బదులు మరొకరిని..

దుబాయ్: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్‌లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో చేసేదేమి లేక ఆ ఆటగాడిని తమ జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. ప్రీతి జింటా పొరపాటున కొనుగోలు చేసిన ఆటగాడు మన దేశానికే చెందిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ శశాంక్ సింగ్. అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎల్ 2024 వేలం దుబాయ్ వేదికగా ఆసక్తికరంగా సాగింది. వేలం మంచి ఊపు మీదున్న దశలో 237 నంబర్ గల ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అన్ క్యాప్డ్‌ ఆటగాడు శశాంక్ సింగ్ వేలంలోకి వచ్చాడు. కనీస ధర రూ.20 లక్షలతో శశాంక్ సింగ్ పేరు వేలంలోకి వచ్చింది. శశాంక్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. నెస్ వాడియాతోపాటు తమ బృందంతో చర్చించిన ప్రీతి జింటా బేస్ ప్రైజ్ ధర రూ.20 లక్షలకు బిడ్ వేసింది. ఇతర ఫ్రాంచైజీలు ఏవి కూడా శశాంక్ సింగ్ కోసం బిడ్ వేయలేదు. దీంతో శశాంక్ సింగ్ రూ.20 లక్షలకు పంజాబ్ కింగ్స్ గెలుచుకుంది.


237 నంబర్ గల శశాంక్ సింగ్ కోసం ఇతర ఫ్రాంచైజీలు ఏవి కూడా పోటీ పడడకపోవడంతో అతని అమ్మకం చాలా త్వరగా జరిగిపోయింది. ఆ వెంటనే మరో ఆటగాడు తనయ్ త్యాగరాజన్ పేరు వేలంలోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శశాంక్ సింగ్ విషయంలో తాము తప్పు చేశామని ప్రీతి జింటా, నెస్ వాడియాతో కూడిన పంజాబ్ బృందం గుర్తించింది. వేరొక ఆటగాడిగా భావించి శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసినట్టు గ్రహించింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆటగాడు అమ్ముడుపోయాక చేసేదేమి లేదని మల్లికా సాగర్ స్పష్టం చేశారు. దీంతో మరో దారి లేక ఇష్టం లేకపోయిన శశాంక్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ తమ స్క్వాడ్‌లో చేర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వెంటనే వేలంలోకి వచ్చిన తనయ్ త్యాగరాజన్‌‌ను కూడా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీనే కొనుగోలు చేసింది. అతడిని కూడా బేస్ ప్రైజ్ ధర రూ.20 లక్షలకే దక్కించుకుంది.

నిజానికి వేలానికి ముందే ఫ్రాంచైజీలన్నీ హోంవర్క్ చేస్తాయి. తామ కొనుగోలు చేయాలనుకునే ఆటగాళ్ల గురించి విశ్లేషిస్తాయి. పెదగా పాపులారిటీ లేని ఆటగాళ్ల గురించి జట్టు మేనేజ్‌మెంట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. వేలం సమయంలో కూడా వారి ముందున్న ల్యాప్‌ట్యాప్ స్క్రీన్‌లలో మొత్తం ఆటగాళ్ల జాబితా ఉంటుంది. అయినప్పటికీ పొరపాటున పప్పులో కాలేసిన పంజాబ్ కింగ్స్ తమ జాబితాలో లేని ఆటగాడిని కొనుగోలు చేసింది. కాగా రైట్ హ్యాండ్ బ్యాటరైన 32 ఏళ్ల శషాంక్ సింగ్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడాడు. 17 సగటుతో 69 పరుగులు చేశాడు. ఇక ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్‌తోపాటు మరో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

Updated Date - Dec 20 , 2023 | 02:27 PM