Share News

TEACHERS : విచారణకు అడ్డంకులు..?

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:30 AM

: రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల గుర్తింపునకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలిసింది. విందులో పాల్గొన్నవారంతా అనంతపురం అర్బన, రూరల్‌ ప్రాంత ఉపాధ్యాయులేనని సమాచారం. వీరిలో అధికశాతం మంది అనంతపురం అర్బన ఓటర్లు. ఎక్కువశాతం వైసీపీ మద్దతుదారులు. గత నెల 31న ఈ రాజకీయ విందు జరిగింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఉల్లంఘనలపై నిజాయితీగా విచారిస్తున్న అధికారులకు ...

TEACHERS : విచారణకు అడ్డంకులు..?

టవర్‌ డంప్‌ ఇవ్వకుండా ఒత్తిళ్లు

విందులో పాల్గొన్న టీచర్లకు వైసీపీ అండ

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 29: రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల గుర్తింపునకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలిసింది. విందులో పాల్గొన్నవారంతా అనంతపురం అర్బన, రూరల్‌ ప్రాంత ఉపాధ్యాయులేనని సమాచారం. వీరిలో అధికశాతం మంది అనంతపురం అర్బన ఓటర్లు. ఎక్కువశాతం వైసీపీ మద్దతుదారులు. గత నెల 31న ఈ రాజకీయ విందు జరిగింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఉల్లంఘనలపై నిజాయితీగా విచారిస్తున్న అధికారులకు అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. విచారణను ఎలాగైనా తొక్కి పెట్టాలని కొందరు చూస్తున్నారు. అందులో భాగంగానే టవర్‌ డంప్‌ రిపోర్టు బయటకు రాకుండా తొక్కి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి లబ్ధి చేకూర్చేలా..

ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా కొందరు ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు వ్యవహరించారు. వైసీపీకి అనుబంధంగా నడిచే ఒక ఉపాధ్యాయ సంఘం, మరో అనుయాయ ఉపాధ్యాయ సంఘం నాయకులు, పలువురు పీడీలు, ప్రధానోపాధ్యాయులు గత నెల 31న


అనంతపురం నగర శివారులోని ఓ డాబాలో రాజకీయ విందు నడిపారు. దీనికి ఒక వైసీపీ ఎమ్మెల్యే సైతం హాజరు కావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విందులో అనంతపురం అర్బన, రూరల్‌ ప్రాంతంలోని పలు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, వైసీపీ సామాజికవర్గం టీచర్లు పాల్గొన్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఓ ఎంఈఓ కూడా ఉడతా భక్తిగా సాయపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా వైసీపీ ఎమ్మెల్యేకు వీరవిధేయుడని, డిన్నర్‌కు వెళ్లిన ఉపాధ్యాయులను అండగా ఉన్నారని సమాచారం.

15 రోజులపైగానే...

రాజకీయ విందుపై జడ్పీ సీఈఓ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. వైసీపీకి కొమ్ముకాచేలా రాజకీయ విందుకు హాజరైన వారి వివరాలు కోరుతూ.. సుమారు పక్షం రోజుల కిందట ఎస్పీకి లేఖ రాసినట్లు సమాచారం. అయితే విచారణాధికారికి పోలీస్‌ శాఖ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండా కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ వెంట నడిచే టీచర్లు, ఆ పార్టీకి పరోక్షంగా ప్రచారం చేస్తున్న టీచర్లను కాపాడుకోడానికే అధికార పార్టీవారు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 30 , 2024 | 12:30 AM