Share News

Student Murder: అనంతపురం జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం..

ABN , Publish Date - Sep 08 , 2024 | 10:56 AM

జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థిని తలపై బండరాయితో మోది హత్య చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది.

Student Murder: అనంతపురం జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం..

అనంతపురం: జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి అటవీ ప్రాంతంలో విద్యార్థిని తలపై బండరాయితో మోది హత్య చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామానికి చెందిన యువతి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మారెమ్మ పండగ ఉత్సవాల సందర్భంగా యువతి ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. పండగ అనంతరం కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరింది. దీంతో రాయదుర్గం నుంచి అనంతపురం వెళ్లేందుకు తండ్రి ఆమెను ఆర్టీసీ బస్సు ఎక్కించారు. పంపనూరు వద్ద బస్సు దిగిన యువతి ప్రియుడి ద్విచక్రవాహనంపై వడ్డపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


వడ్డుపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్న ప్రేమికుల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో యువతిని ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై బండరాయితో కొట్టడంతో యువతి మృతిచెందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్దకు బాధిత కుటుంబం చేరుకుంది. తమ కుమార్తెను హత్య చేసిన వ్యక్తిని వదిలిపెట్టొద్దంటూ తల్లిదండ్రులు పోలీసులను కోరారు. అయితే యువతి చంపిన ప్రియుడు పరారీలో ఉండగా.. కాల్ లిస్ట్ ఆధారంగా అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Updated Date - Sep 08 , 2024 | 11:04 AM