Share News

DK Siva Kumar: తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:49 PM

తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.

 DK Siva Kumar: తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

కర్నూలు: తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరమని అన్నారు.


19వ గేటు చైన్‌ లింక్‌ తెగిపోవడంతో సమస్య తలెత్తిందని అన్నారు. 17వ గేటు నుంచి 32వ గేట్ల నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. నిపుణుల బృందం జలాశయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. కేంద్ర జల సంఘం కూడా నిపుణులను పంపిందని వివరించారు. జలాశయం నుంచి నీరు పెద్ద ఎత్తున బయటకు పోతోందని అన్నారు. జలాశయం దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ డ్యామ్ కర్నాటక - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మూడు రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచినట్లు తెలిపారు. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని వివరించారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని చెప్పారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనని.. రైతులు సహకరించాలని డిప్యూటీ సీఎం శివకుమార్ కోరారు.

తుంగభద్ర జలాశయంపై సీఎం సిద్ధరామయ్య ఆరా

కర్ణాటక: తుంగభద్ర రిజర్వాయర్‌ గేటు తెగిపోయిన ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. తుంగభద్ర జలాశయం వద్ద తాజా పరిణామాలపై సీఎం ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్‌ ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. ఎల్లుండి (మంగళవారం) జలాశయం వద్దకు సీఎం సిద్దరామయ్య వెళ్లనున్నారు.


అసలేం జరిగిందంటే ..?

అధికారుల నిర్లక్ష్యంతో డ్యామ్ గేటు ఊడింది. కర్ణాటకలో హోస్పేట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు (Tungabhadra Dam 19Th Gate) నిన్న రాత్రి (శనివారం) ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. గేటు తెగడంతో నీటి ప్రవావం పోటెత్తింది. తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. ప్రాజెక్ట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు బయటకు వస్తోంది.


60 టీఎంసీల నీరు..

ప్రాజెక్ట్ నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్దరణ పనులు చేపడతామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆదివారం ఉదయం డ్యామ్‌ను కర్ణాటక మంత్రి శివరాజ్ సందర్శించారు. డ్యాట్ గేటు కొట్టుకోని పోవడంతో కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాలు ప్రజలపై ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో కోరింది. సహాయం కోసం 1070 112, 1800 425 0101 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది.


చంద్రబాబు ఆరా..

తుంగభద్ర డ్యామ్ గేటు ఊడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డ్యామ్ వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని కోరారు. అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యామ్ గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. డ్యామ్ 19వ గేటు నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు గుర్తించారు.

Updated Date - Aug 11 , 2024 | 05:26 PM