Share News

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:52 AM

నీట్‌ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో నీట్‌ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్‌ చేసింది.

Delhi : నీట్‌ దర్యాప్తులో సీబీఐ జోరు

  • మూడు రాష్ట్రాల్లో నమోదైన ఐదు కేసుల స్వీకరణ.. పట్నా, గోధ్రాల్లో వివరాలు సేకరిస్తున్న ప్రత్యేక బృందాలు

పట్నా, గోధ్రా, న్యూఢిల్లీ, జూన్‌ 24: నీట్‌ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో నీట్‌ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్‌ చేసింది. రాజస్థాన్‌లో మూడు కేసుల దర్యాప్తును స్వీకరించింది. మహారాష్ట్రలోని లాతూరులో యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) నమోదు చేసిన మరో కేసును కూడా సీబీఐ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కాగా.. నీట్‌ అక్రమాలపై బిహార్‌, గుజరాత్‌లో నమోదైన కేసుల దర్యాప్తునకు ఆదివారానికే పట్నా, గోధ్రాకు చేరుకున్న సీబీఐ ప్రత్యేక బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. పట్నాకు చేరుకున్న సీబీఐ బృందం.. కొద్దిరోజులుగా అక్కడ పేపర్‌ లీక్‌ కేసును అత్యంత సమర్థంగా దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం (ఈవోయు) కార్యాలయానికి సోమవారం ఉదయం వెళ్లి కీలక వివరాలు సేకరించింది. ముమ్మర దర్యాప్తు చేసి ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన ఈవోయు.. వారి మొబైల్‌ ఫోన్లను, సిమ్‌కార్డులను, ల్యాప్‌టా్‌పలను, పోస్ట్‌డేటెడ్‌ చెక్కులను, కాల్చేసిన నీట్‌ ప్రశ్నపత్రం అవశేషాలను స్వాధీనం చేసుకుంది.

నీట్‌ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి బదిలీ చేస్తూ బిహార్‌ సర్కారు ఆదివారం సాయంత్రం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నిందితులందరినీ విచారణ నిమిత్తం సీబీఐ బృందం ట్రాన్సిట్‌ రిమాండ్‌పై ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉందని ఈవోయు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన దానాపూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ జూనియర్‌ ఇంజనీర్‌ సికందర్‌ ప్రసాద్‌ యాదవేందుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా సీబీఐ నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.


యాదవేందును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు ఆ అధికారి వెల్లడించారు. ‘‘అతడికి క్రిమినల్‌ కార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. 2012లో జూనియర్‌ ఇంజనీర్‌ కాక ముందు అతడు రాంచీలో కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. గతంలో జరిగిన రూ.3 కోట్ల విలువైన ఎల్‌ఈడీ స్కామ్‌లో అతడికి జైలు శిక్ష పడింది’’ అని ఆ అధికారి వివరించారు. మరోవైపు.. గోధ్రాకు చేరుకున్న సీబీఐ బృందం స్థానిక పోలీసు అధికారులను కలిసి, నీట్‌ పేపర్‌ లీక్‌కు సంబంధించి వివరాలు సేకరించినట్టు పంచమహల్‌ జిల్లా ఎస్పీ హిమాన్షు సోలంకి తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో గుజరాత్‌ పోలీసులు ఇప్పటిదాకా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. అక్కడి ఒక కేంద్రంలో పరీక్ష రాసే 27 మంది అభ్యర్థులతో వారు ఒప్పందం చేసుకున్నారు.

దాని ప్రకారం.. వారు ప్రశ్నపత్రంలో తమకు తెలిసిన సమాధానాలు రాసి మిగతావాటిని వదిలిపెడితే, వాటికి వీరు సమాధానాలు రాస్తారు. ఇందుకోసం ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారు. ఈ మేరకు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు సహకరించినప్పటికీ.. ఆ 27 మందిలో ముగ్గురు మాత్రమే నీట్‌ను క్లియర్‌ చేసినట్టు సమాచారం. ఇక.. మహారాష్ట్రలోనూ నీట్‌ అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలపై నాందేడ్‌ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు లాతూర్‌కు చెందిన జలీల్‌ ఖాన్‌ ఉమర్‌ ఖాన్‌ పఠాన్‌ అనే జిల్లా పరిషత్‌ స్కూల్‌ టీచర్‌ను అరెస్ట్‌ చేశారు.


అతడితో పాటు లాతూరుకే చెందిన సంజయ్‌ తుకారామ్‌ జాధవ్‌ అనే టీచర్‌పైన, నాందేడ్‌కు చెందిన ఇరాన్నా మషన్జీ కొంగల్వావ్‌, ఢిల్లీకి చెందిన గంగాధర్‌ అనే ఇద్దరు వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. జలీల్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసిన ఏటీఎస్‌ అధికారులు.. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కాగా.. నీట్‌ పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన రాజస్థాన్‌ హైకోర్టు.. ఆ పిటిషన్లపై స్పందన తెలపాలంటూ జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీకి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.నియమించేందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా ఆరోపించారు.

Updated Date - Jun 25 , 2024 | 04:52 AM