Share News

Nitish Kumar: నితీశ్‌కు ‘ప్రధాని’ ఆఫర్‌పై మరో ట్విస్ట్.. అసలు ఏమైందంటే?

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:19 AM

జనతాదళ్ (యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ‘ప్రధాని’ పదవి ఆఫర్ చేసిందని ఇటీవల ఆ పార్టీ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం..

Nitish Kumar: నితీశ్‌కు ‘ప్రధాని’ ఆఫర్‌పై మరో ట్విస్ట్.. అసలు ఏమైందంటే?
JDU MP Nitish Jha Gives Clarity On Nitish Kumar PM Offer

జనతాదళ్ (యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు (Nitish Kumar) ఇండియా కూటమి (INDIA Alliance) ‘ప్రధాని’ పదవి ఆఫర్ చేసిందని ఇటీవల ఆ పార్టీ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ఆ కూటమిలోని కొందరు అగ్రనేతలు నేరుగా నితీశ్‌ను సంప్రదించి ప్రధాని పదవి ఆఫర్ చేసేందుకు ప్రయత్నం చేశారని, కానీ ఆయన దాన్ని తిరస్కరించారని త్యాగి చెప్పారు. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ అంశంపై జేడీయూ ఎంపీ సంజయ్ ఝా (Sanjay Jha) కుండబద్దలయ్యే వాస్తవాన్ని బయటపెట్టారు.

నితీశ్ కుమార్‌కు అత్యంత నమ్మకస్తుడైన సంజయ్ ఝా మాట్లాడుతూ.. త్యాగి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. నితీశ్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ చేసిందన్న సమాచారం తమ పార్టీకి అందలేదని, స్వయంగా నితీశ్‌కు సైతం ఈ విషయం తెలియదని పేర్కొన్నారు. తనకు అవగాహన ఉన్నంతవరకూ.. ఇండియా కూటమి నుంచి నితీశ్‌కు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదని ఆయన తేల్చి చెప్పారు. అసలు త్యాగి అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే.. కేసీ త్యాగి ఇండియా కూటమి ఇమేజ్‌ని దెబ్బతీసేందుకు.. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలేంటి?

ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీ త్యాగి మాట్లాడుతూ.. ‘‘నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది. ఎవరైతే ఆ కూటమికి నితీశ్‌ను కన్వీనర్ అయ్యేందుకు అనుమతించలేదో.. ఆ వ్యక్తుల నుంచే ఈ ఆఫర్ ఆయనకు వచ్చింది. కానీ తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని చెప్పి, ఆ ఆఫర్‌ని నితీశ్ తిరస్కరించారు’’ అని చెప్పుకొచ్చారు. కానీ.. ఈ ఆఫర్ చేసిన నాయకుల పేర్లను మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఆ కూటమిలో సరైన మర్యాద దక్కకపోవడం వల్లే నితీశ్ ఎన్డీఏలోకి చేరారన్నారు. అయితే.. నితీశ్‌కు ప్రధాని ఆఫర్ రాలేదని సొంత పార్టీ ఎంపీనే చెప్పడంతో.. త్యాగి చెప్పిందంతా అబద్ధమని తేటతెల్లమైంది.

కాంగ్రెస్ పార్టీ క్లారిటీ

కాంగ్రెస్ పార్టీ సైతం కేసీ త్యాగి వాదనలను తోసిపుచ్చింది. ఆయన చెప్పిందంతా అబద్ధమని మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. అలాంటి సమాచారం మాకు అందలేదు. నాకు తెలిసి.. కేసీ త్యాగి ఒక్కరికే ఈ విషయం తెలిసి ఉంటుంది’’ అంటూ సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలొచ్చాక తాము నితీశ్‌కుమార్‌ని సంప్రదించలేదని, ఇదొక అసత్య ప్రచారమని ఆయన తేల్చి చెప్పారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 11:19 AM