Share News

Karnataka: మాస్‌ రేపిస్టుకు మోదీ మద్దతు

ABN , Publish Date - May 03 , 2024 | 03:28 AM

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ 400మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు చిత్రీకరించాడని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Karnataka: మాస్‌ రేపిస్టుకు మోదీ మద్దతు

  • 400 మంది మహిళలపై ప్రజ్వల్‌ అత్యాచారం

  • అతడికి మద్దతుగా మోదీ ప్రచారం చేశారు

  • అన్నీ తెలిసీ జేడీఎస్‌తో పొత్తు : రాహుల్‌ గాంధీ

  • ప్రజ్వల్‌కు లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసిన సిట్‌

బెంగళూరు, మే 2(ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ 400మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు చిత్రీకరించాడని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గురువారం కర్ణాటకలోని శివమొగ్గలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మా ట్లాడారు. ప్రజ్వల్‌ తరఫున ప్రచారం చేసినందుకు దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇది సెక్స్‌ కుంభకోణం కాదు.. మాస్‌ రేప్‌ అన్నారు.


ఒక మాస్‌ రేపిస్టుకు మద్దతుగా ప్రధాని ప్రచారం చేశారని విమర్శించారు. ప్రజ్వల్‌కు ఓటు వేస్తే తనకు మద్దతు ఇచ్చినట్టేనని రాష్ట్ర ప్రజల ముందు చెప్పిన మోదీ.. దేశంలోని ప్రతి మహిళను అవమానించారని మండిపడ్డారు. ‘ప్రజ్వల్‌ మాస్‌ రేపిస్ట్‌ అని బీజేపీలో ప్రతి నాయకుడికీ తెలుసు. అయినా అతడికి మద్దతు పలకడమే కాకుండా జేడీఎ్‌సతో పొత్తు పెట్టుకున్నారు’ అని ఆయన ఆరోపించారు. ఒక మాస్‌ రేపిస్ట్‌ కోసం ప్రధాని ప్రచారం చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య తదితరులు పాల్గొన్నారు.


నడ్డా రాజీనామా చేయాలి: రాహుల్‌

సమానత్వాన్ని కోరుకునే వారందరూ నక్సలైట్లేనని వ్యాఖ్యానించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజీనామా చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ‘బీజేపీ నేతలు మరోసారి రాజ్యాంగంపై దాడి చేశారు. దళితులు, ఓబీసీలు, గిరిజనులు సమానత్వం కోరుకుంటే వారంతా నక్సలైట్లు అని నడ్డా చెబుతున్నారు. రాజ్యాంగంపై ఇంతకంటే పెద్దదాడి మరొకటి ఉండదు’ అని రాహుల్‌ ఆరోపించారు. రాజ్యాంగంపై దాడి చేసినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.


మోదీ సర్కారు రిజర్వేషన్లు లాక్కుంటోంది

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను తొలగిస్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను రహస్యం లాగేసుకుంటోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, రిజర్వేషన్లు లేకుండా చేయడమే మోదీ మంత్ర అని అన్నారు. 2013లో ప్రభుత్వ రంగంలో 14 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఉండగా 2023 నాటికి అవి 8.4 లక్షలకు తగ్గాయని గురువారం ‘ఎక్స్‌’లో రాహుల్‌ వెల్లడించారు.


బీజేపీలో అవినీతిపరులు: ప్రియాంక

చిర్మిరి(ఛత్తీ్‌సగఢ్‌), మే 2: అవినీతిపరులు, ప్రజా సంక్షేమం గురించి నోరెత్తని నాయకులను బీజేపీ ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. గురువారం ఛత్తీ్‌సగఢ్‌లోని చిర్మరీ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం దేశ ఆస్తులను బిలియనీర్లకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ‘‘బీజేపీలో రెండు రకాలైన నేతలను ప్రమోట్‌ చేస్తున్నారు.

వీరిలో అత్యంత అవినీతిపరులు మొదటి రకం. ఇతర పార్టీలకు చెందిన అవినీతి నేతలపై ఆరోపణలు చేసి, వారిపై ఒత్తిడి తెచ్చి, బీజేపీలో చేర్చుకుంటారు. అప్పుడు వారు సచ్ఛీలురు అయిపోతారు. వారిపై ఎలాంటి కేసులూ ఉండవు’ అని ప్రియాంక అన్నారు. ‘ఇక ప్రజా సమస్యల గురించి మాట్లాడనివారు రెండో రకం నాయకులు. ధరల పెరుగుదల, ప్రజల సమస్యలపై వారు తమ ప్రసంగాల్లో ఒక్కసారి కూడా మాట్లాడరు’’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - May 03 , 2024 | 03:28 AM