Share News

PM Modi : శివాజీ మాకు దేవుడు!

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:41 AM

మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌ జిల్లాలో శివాజీ విగ్రహం ఇటీవల కూలిపోవడంపై ప్రధాని మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంటే ఒక పేరో.. ఒక రాజో కాదు. మాకు ఆయన దేవుడు.

PM Modi : శివాజీ మాకు దేవుడు!

  • మహారాష్ట్రలో ఆయన విగ్రహం కూలడంపై క్షమాపణ చెబుతున్నా: ప్రధాని

  • దేశవ్యాప్తంగా 218 ఫిషరీస్‌ ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు

  • ఏపీలో జువ్వలదిన్నె హార్బర్‌ కూడా..

  • మహారాష్ట్రలో వాధ్వాన్‌ పోర్టుకు శంకుస్థాపన

పాల్‌ఘర్‌, ఆగస్టు 30: మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌ జిల్లాలో శివాజీ విగ్రహం ఇటీవల కూలిపోవడంపై ప్రధాని మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంటే ఒక పేరో.. ఒక రాజో కాదు. మాకు ఆయన దేవుడు. ఇవాళ ఆయన పాదాల ముందు నా శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా’ అని పేర్కొన్నారు. తొలిసారి తనను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు శివాజీ సామ్రాజ్య రాజధాని అయిన రాయగఢ్‌ను సందర్శించి.. ఆయన సమాధి వద్ద ధ్యానం చేశానని గుర్తుచేసుకున్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో వాధ్వాన్‌ పోర్టు ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు.

ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని జువ్వలదిన్నె హార్బర్‌ సహా దేశవ్యాప్తంగా రూ.1,560 కోట్ల వ్యయంతో చేపట్టిన 218 ఫిషరీస్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సముద్ర రక్షణకు శివాజీ చేసిన కృషికి గుర్తింపుగా నిరుడు డిసెంబరులో నౌకాదళ వేడుకలను పురస్కరించుకుని సింధ్‌దుర్గ్‌ జిల్లా రాజ్‌కోట్‌ కోటలో ఆయన విగ్రహాన్ని మోదీ స్వయంగా ఆవిష్కరించారు. అయితే అది గత సోమవారం కూలిపోయింది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండడంతో ప్రధాని స్పందించారు. ‘‘కొందరు వ్యక్తులు వీరసావర్కర్‌ను దూషిస్తూ ఉంటారు.


ఆయన్ను అవమానించినందుకు క్షమాపణ చెప్పరు. నేను ఇక్కడ దిగగానే.. శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిపోయినందుకు మొదట క్షమాపణ చెప్పాను. విగ్రహం కూలడంతో మనోభావాలు దెబ్బతిన్నవారికీ నా క్షమాపణలు’’ అని తెలిపారు. భారత్‌ను అభివృద్ధి పథంలో నడపాలన్న సంకల్పంలో మహారాష్ట్ర అభివృద్ధి కూడా భాగమని.. అందుకే గత పదేళ్లుగా రాష్ట్ర పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘వాధ్వాన్‌ పోర్టును రూ.76 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద కంటైనర్‌ పోర్టుగా ఇది రూపుదిద్దుకోనుంది’’ అని వెల్లడించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా చేపల ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెద్దఎత్తున పెంచుతున్నామన్నారు.

2014లో చేపల ఉత్పత్తి 80 లక్షల టన్నులు మాత్రమే ఉండేదని.. ఇప్పుడు 1.7 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. కాగా.. రూ.360 కోట్లతో ఏర్పాటుచేసిన ‘నేషనల్‌ రోలవుట్‌ ఆఫ్‌ వెసెల్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులతో నేరుగా సంభాషించేందుకు, వారిని రక్షించేందుకు ఇది ఉపకరిస్తుంది.

Updated Date - Aug 31 , 2024 | 05:41 AM