Share News

Rahul Gandhi : కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడమేమిటి?

ABN , Publish Date - Aug 27 , 2024 | 05:33 AM

జమ్మూ-కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడంలో అర్థం లేదని కాంగ్రెస్‌ నాయకుడు, విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం సరికాదని, వెంటనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండు చేశారు.

Rahul Gandhi : కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడమేమిటి?

  • రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించాలి: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, ఆగస్టు 26: జమ్మూ-కశ్మీర్‌ను ఢిల్లీ నుంచి పాలించడంలో అర్థం లేదని కాంగ్రెస్‌ నాయకుడు, విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం సరికాదని, వెంటనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండు చేశారు.

గత వారం జమ్మూ-కశ్మీర్‌లో పర్యటించిన ఆయన శ్రీనగర్‌లో అక్కడి విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సంభాషణల వీడియో సోమవారం విడుదలయింది. జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేయడం తమకెవరికీ నచ్చలేదని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానిని విమర్శిస్తూ ‘‘మోదీతో వచ్చిన సమస్య ఏమిటంటే ఆయన ఎవరి మాటా వినరు.

తప్పని చెప్పినా ఒప్పుకోరు. ఆయన చెప్పేదే నిజమని నమ్ముతారు’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర హోదా ఉంటేనే నిజమైన ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో ఈ అంశంపై చర్చ జరగాలన్నారు. కాగా, రాహుల్‌ ఎవరితో ముచ్చటించినా పెళ్లెప్పుడంటూ వారు అడగడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది.

కశ్మీరీ విద్యార్థినులు కూడా ఆ 54 ఏళ్ల కాంగ్రెస్‌ నేతను ఇదే ప్రశ్న వేశారు. ‘‘20-30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నా’’ అంటూ ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘ఏవైనా ప్లాన్లు ఉన్నాయా?’’ అని వారు మళ్లీ అడిగారు. ‘‘ప్లాన్లు ఏమీ లేవుగానీ...ఒక వేళ జరిగితే....’’ అంటూ మధ్యలోనే ఆపేశారు. ‘‘అప్పుడు తప్పకుండా మమ్మల్ని పిలవండి’’ అని వారంతా కోరారు. ‘‘తప్పకుండా’’ అని రాహుల్‌ సమాధానం ఇవ్వడంతో అందరూ కలిసి గట్టిగా నవ్వేశారు.

Updated Date - Aug 27 , 2024 | 05:33 AM