Share News

IND vs ENG: ఉప్పల్‌ మ్యాచ్‌లో సౌకర్యాలపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. వీడియో షేర్!

ABN , Publish Date - Jan 29 , 2024 | 08:52 AM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగడానికి సరైన మంచి నీటి వసతి కల్పించకపోవడానికి తోడు టాయిలెట్స్‌ను కూడా శుభ్రంగా ఉంచలేదు.

IND vs ENG: ఉప్పల్‌ మ్యాచ్‌లో సౌకర్యాలపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. వీడియో షేర్!

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగడానికి సరైన మంచి నీటి వసతి కల్పించకపోవడానికి తోడు టాయిలెట్స్‌ను కూడా శుభ్రంగా ఉంచలేదు. దీంతో మ్యాచ్‌ను చూడడానికి స్టేడియానికి వచ్చిన అభిమానులకు సమస్యలు తప్పలేదు. స్టేడియంలోని నాసిరకమైన ఏర్పాట్లపై ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా టాయిలెట్స్ మురికిగా ఉన్నాయని ఓ వీడియోను కూడా ఎక్స్‌లో షేర్ చేశారు. అలాగే స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, సన్‌స్క్రీన్ వంటి వాటిని అనుమతించకపోవడంపై కూడా నిరాశ వ్యక్తం చేశారు.


కాగా స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించడం లేదనిహెచ్‌సీఏ ముందుగానే ప్రకటించింది. కానీ స్టేడియంలో సరైన నీటి వసతిని ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఇంగ్లండ్ అభిమానులు చెబుతున్న దాని ప్రకారం స్టేడియంలో తాగు నీటి వసతులను తక్కువ చోట్ల ఏర్పాటుచేశారు. దీంతో తాగు నీటి కోసం భారీగా క్యూలైన్లు కట్టారు. మంచి నీరు తాగడానికి గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చింది. గ్రౌండ్‌లో కనీసం వాటర్ బాటిళ్లు, సన్‌స్క్రీన్‌లను కూడా అమ్మలేదు. ఇక టాయిలెట్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. టాయిలెట్స్ మురికి నీటితో నిండి ఉన్నాయి. వాటిని ఏమాత్రం శుభ్రం చేయలేదు. దీంతో హెచ్‌సీఏ అధికారుల తీరుపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ను భారత్‌ ఓటమితో ఆరంభించింది. ఉప్పల్‌లో నాలుగో రోజైన ఆదివారమే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో 1-0తో సిరీ్‌సలో ముందుకెళ్లింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ (7/62) భారత్‌ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. ఆరంభంలోనే టాపార్డర్‌ను కుదురుకోనీయకుండా దెబ్బతీశాడు. అయితే చివర్లో టెయిలెండర్లు పోరాటం చూపారు. కానీ కీలక సమయంలో వారిని సైతం పెవిలియన్‌కు చేర్చిన హార్ట్‌లీ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఫలితంగా 231 రన్స్‌ ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ (39), భరత్‌ (28), అశ్విన్‌ (28), రాహుల్‌ (22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అంతకుముందు ఇంగ్లం డ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 420 రన్స్‌ చేసింది. ఒల్లీ పోప్‌ (196) తృటిలో డబుల్‌ సెంచరీ కోల్పోయాడు. హార్ట్‌లీ (34), రెహాన్‌ (28) రాణించారు. బుమ్రాకు 4, అశ్విన్‌కు 3, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 246, భారత్‌ 436 పరుగులు చేశాయి. పోప్‌నకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. రెండో టెస్టు వచ్చేనెల 2న విశాఖపట్నంలో మొదలవనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 08:53 AM