Share News

university: 15లోగా కొత్త వీసీలు..

ABN , Publish Date - Jun 04 , 2024 | 05:13 AM

విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ఈ నెల 15లోగా నియమిస్తామని విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. 3 రోజుల్లో సెర్చ్‌ కమిటీల సమావేశాలను పూర్తిచేసి, కొత్త వీసీల నియామక ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

university: 15లోగా కొత్త వీసీలు..

  • మూడు రోజుల్లో సెర్చ్‌ కమిటీ సమావేశాలు

  • 6 లేదా 7 నుంచి బడిబాట కార్యక్రమం

  • విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ఈ నెల 15లోగా నియమిస్తామని విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. 3 రోజుల్లో సెర్చ్‌ కమిటీల సమావేశాలను పూర్తిచేసి, కొత్త వీసీల నియామక ప్రక్రియను చేపడతామని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త వీసీల నియామకంపై ఇప్పటికే కొంత కసరత్తు జరిగిందని.. మూడు రోజుల్లో సెర్చ్‌ కమిటీ సమావేశాలను పూర్తిచేస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తామన్నారు. అలాగే.. విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించడమే లక్ష్యంగా 6 లేదా 7వ తేదీ నుంచి రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెంకటేశం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించే అవకాశం ఉందన్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. సర్కారు బడుల్లో చదివితే ఫీజుల భారం ఉండదని, పౌష్టిక ఆహారం లభిస్తుందని, ట్రిపుల్‌ ఐటీ వంటి సంస్థల్లో సీట్లను పొందచవ్చని, ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్‌లను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక.. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరలోనే చేపడతామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.20 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారని.. త్వరలోనే డీఎస్సీ ద్వారా మరో 11 వేల మంది కొత్త ఉపాధ్యాయులు వస్తారని, వీరే కాకుండా 2008 డీఎస్సీ ద్వారా మరో మూడు వేల మంది వరకూ అందుబాటులోకి వస్తారని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉండాల్సిన ఉపాధ్యాయ పోస్టుల నిష్పత్తి కంటే మెరుగ్గానే టీచర్లు ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఉద్యోగికీ హాజరు విధానాన్ని అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి వంటి వారికి కూడా హాజరు పద్ధతిని ప్రవేశపెట్టేఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.


ఫీజుల నియంత్రణపై..

నార్మలైజేషన్‌ లేకుండా టెట్‌ పరీక్షల ఫలితాలను వెల్లడించాలనే ఆలోచన ఉందని వెంకటేశం తెలిపారు. అలాగే... కేంద్రం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)పైన కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోని ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని వెల్లడించారు. ఇక.. స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ అంశాన్ని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే ఒక నివేదికను సబ్‌కమిటీకి అందించామని, దీనిపై కమిటీ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 05:13 AM