Share News

Metro Phase II: పాతబస్తీలో మెట్రోను ప్రారంభిస్తాం..

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:24 AM

‘‘మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పాతబస్తీలో మెట్రో నిర్మాణాన్ని చేపడతాం. 2029 ఎన్నికల నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Metro Phase II: పాతబస్తీలో మెట్రోను ప్రారంభిస్తాం..

  • కేంద్రం నిఽధులివ్వకపోయినా ప్రాజెక్టు నిర్మిస్తాం.. 2029 ఎన్నికల నాటికి అందుబాటులోకి తెస్తాం

  • అక్బర్‌ వస్తే.. కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెడతాం

  • డిప్యూటీ సీఎం పదవి ఇస్తాం: రేవంత్‌

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘‘మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పాతబస్తీలో మెట్రో నిర్మాణాన్ని చేపడతాం. 2029 ఎన్నికల నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో నిర్మాణానికి అనేక సంస్థలు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, అదే సమయంలో ఇన్వెస్టర్లు కూడా చాలామంది సుముఖంగా ఉన్నారని చెప్పారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. పాతబస్తీకి మెట్రోలైన్‌తో పాటు పలు అంశాలను లేవనెత్తారు. ఎన్నికల సమయంలో తనతో సహా పలువురు ముస్లింలపైనా కేసులు పెట్టారని ఆయన అన్నారు.


తన తప్పు లేదని తెలిసినా తనపై కేసును ఉపసంహరించేది లేదని పోలీసు కమిషనర్‌ అన్నారని తెలిపారు. కానీ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించిన అమిత్‌షా, కిషన్‌ రెడ్డిపై నమోదు చేసిన కేసును మాత్రం ఉపసంహరించుకున్నారని చెప్పారు. రేవంత్‌.. పెద్దన్న అని అంటోన్న మోదీకి సోదరుడు, మిత్రుడనే అమిత్‌ షాపై పెట్టిన కేసును పోలీసులు ఉపసంహరించారా అని ప్రశ్నించారు. తాను సీఎం రేవంత్‌కు పేద సన్నిహితుడిని కాబట్టే తనపై కేసును కొనసాగిస్తున్నారా అని అక్బర్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మా ట్లాడుతూ.. పాతబస్తీకి మెట్రో విస్తరణ వ్యవహారంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతానికి మెట్రోరైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాంద్రాయణగుట్ట దగ్గర శంకుస్థాపన చేశామని చెప్పారు.


రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా 78 కిలోమీటర్ల మేర ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చామని వెల్లడించారు. మెట్రో రెండో దశపై నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీతోనూ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను ఏర్పాటు చేస్తుందని, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట ప్రాంతాల మీదుగా నిర్మాణం ఉంటుందని, ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను కూడా చేపట్టామని చెప్పారు. అయితే పాతబస్తీలో మెట్రోప్రాజెక్టును నిర్మించలేమని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ చేతులెత్తేసిందని, నిర్మించలేకపోతే చంచల్‌గూడ జైలో, చర్లపల్లి జైలో తేల్చుకోవాలన్న విషయాన్ని వారికే వదిలేశానని స్పష్టంచేశారు. పాతబస్తీని ఓల్డ్‌సిటీ అంటున్నారని, కానీ నిజానికి అదే ఒరిజినల్‌ సిటీ అని అన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌లా చేస్తామని, వరంగల్‌ను లండన్‌లా, కరీంనగర్‌ను న్యూయార్క్‌లా తయారు చేస్తామని చెప్పి తాము కాలం వెళ్లదీయమని, చెప్పింది చేసి తీరుతామని రేవంత్‌ అన్నారు.


  • షా, కిషన్‌రెడ్డిలపై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్సే

లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో చిన్న పిల్లలతో ప్రచారం చేయిస్తున్నారని అమిత్‌షా, కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని, ఆ ఉద్దేశంతోనే మోదీని ‘పెద్దన్న’ అని సంబోధించానని తప్పితే.. రాజకీయ ప్రయోజనాలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు. కాగా, సభలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌, ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఓబీసీలపై తమకు ప్రేమ ఉందని, అందుకే చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలిపితే.. ఓడిపోయారని రేవంత్‌ అన్నారు.


అయితే ఓల్డ్‌సిటీకి మెట్రోరైల్‌ను తీసుకువస్తున్నందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసే ఓబీసీ అభ్యర్ధిని గెలిపించేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అక్బర్‌ స్పందిస్తూ.. తాను కొడంగల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానన్నారు. దీనికి స్పందించిన రేవంత్‌.. అక్బర్‌ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే.. కాంగ్రెస్‌ తరఫున కొడంగల్‌లో పోటీ చేసేందుకు బీ-ఫారమ్‌ ఇచ్చే బాధ్యత తనదేనని, గెలిపించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని చెప్పారు. గెలిచిన తరువాత డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చి అసెంబ్లీలో తనపక్కనే కూర్చోబెట్టుకుంటానని రేవంత్‌ అన్నారు. స్పందించిన అక్బర్‌.. తన చివరిశ్వాస వరకు మజ్లి్‌సలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Updated Date - Jul 28 , 2024 | 03:24 AM