Share News

Kishan Reddy: నిరుద్యోగులకు కాంగ్రెస్‌ దగా..

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:34 AM

అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy: నిరుద్యోగులకు కాంగ్రెస్‌ దగా..

  • 2 లక్షల ప్రభుత్వ కొలువులు..

  • గ్యారెంటీలు ప్రజలకు గుదిబండలు

  • రాష్ట్రంలో మంత్రుల దోపిడీ: కిషన్‌రెడ్డి

కవాడిగూడ/హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దాకా బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. శనివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఏమైయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్‌ స్కూటీ ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మాట తప్పారని అన్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలు ప్రజలకు గుదిబండలుగా మారాయని అన్నారు.


వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు అండగా ఉంటామని సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పుడు వారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. నిరసన తెలిపితే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. హామీల అమలులో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికీ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదని.. గ్రూప్‌-1, 2 పోస్టులను పెంచలేదని బీజేవైఎం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. నిరుద్యోగులకు రూ.4వేల చొప్పున భృతి ఇవ్వాలని, 9వేలకు పైగా పోస్టులతో కొత్తగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.


ఏఐతో ఖనిజాల అన్వేషణ

భారత్‌లో కృతిమ మేధ(ఏఐ), మెషీన్‌ లర్నింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌ రంగంలో పురోగతి సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశం 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా రూపొందడంలో ఖనిజాల పాత్ర కీలకం అవుతుందన్నారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ హోటల్‌లో శనివారం ఖనిజాన్వేషణ హ్యాకథాన్‌, నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. క్రిటికల్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మినరల్‌ బ్లాక్స్‌ 2, 3 వేలం పాటల్లో ఎంపికైన 8మంది బిడ్డర్లకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. అనంతరం 4వ విడత వేలాన్ని ప్రారంభించారు.


పెద వాగు బాధితులకు సంజయ్‌ ఫోన్‌

పెదవాగు వరదలో చిక్కుకుపోయి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహకారంతో బయటపడిన నారాయణపురం గ్రామస్తులతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఢిల్లీ నుంచి ఫోన్‌లో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్వహణ లోపం, సిబ్బంది కొరత వల్లే ఈ నష్టం వాటిల్లిందని గ్రామస్తులు సంజయ్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సంజయ్‌ వారికి హామీ ఇచ్చారు. రుణమాఫీ విషయంలో మ్యానిఫెస్టోలో లేని షరతులు అధికారం చేపట్టాక ఎలా వచ్చాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు. రైతు భరోసాలోనూ మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 03:34 AM