Share News

CM Revanth: తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Jun 29 , 2024 | 10:19 PM

తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth: తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతా
CM Revanth Reddy

వరంగల్: తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు(శనివారం) వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు. ఫార్మారంగం ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్‌కు స్థానం ఉంటుందని తెలిపారు. ఇందుకు కారణం దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దూర దృష్టినేనని చెప్పారు. రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించిందన్నారు.


హెల్త్ ప్రొఫైల్ కార్డు ఆలోచన..

మెడికవర్ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతీ పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు అందించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పోరుతో నిధులు మాయం చేశారని మండిపడ్డారు. వరంగల్‌కు త్వరలో ఎయిర్ పోర్ట్ తెస్తానని హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు. టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభిస్తామని మాటిచ్చారు. అభివృద్ధికి స్కోప్ ఉన్న నగరం వరంగల్ అని ఉద్ఘాటించారు. ఇకపై వరంగల్‌కు ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటానని తెలిపారు. ఈరోజు వరంగల్ అభివృద్ధిపై రివ్యూ చేశానని అన్నారు.

ఉచిత వైద్యం దిశగా..

‘‘రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శంషాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని రకాల వైద్య సేవలు అందించేలా మెడికల్ టూరిజం హబ్ ఉండాలి. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు సాంకేతికంగా మీ సహాయం కోరుతున్నాం. ఆస్పత్రికి ఎంతమంది వచ్చారని కాదు.. ఎంతమంది నవ్వుతూ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లారనేది ముఖ్యం. వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత.డబ్బుల కోణంలో కాదు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేయాలి. నగరానికి త్వరలో ఎయిర్ పోర్ట్ రాబోతోంది, టెక్స్‌టైల్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది.వరంగల్లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


అంచనా వ్యయం పెంచడంపై సీఎం ఆగ్రహం

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని సీరియస్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమేంటని నిలదీశారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.


ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: మంత్రి దామోదర

తెలంగాణా అంటేనే ఓరుగల్లు అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. తెలంగాణలోనే పెద్దదైన మెడికవర్ ఆస్పత్రి వరంగల్‌కు రావడం సంతోషకరంగా ఉందని చెప్పారు. వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని హామీ ఇచ్చారు. వైద్య సేవ చాలా పవిత్రమైనదని అన్నారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేస్తామని : మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Updated Date - Jun 29 , 2024 | 10:26 PM