Share News

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌రావు లేఖ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Aug 23 , 2024 | 01:38 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని మండిపడ్డారు.

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌రావు లేఖ.. ఎందుకంటే..?
Harish Rao

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని హరీష్‌రావు మండిపడ్డారు.


ఈరోజు (శుక్రవారం) తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ... పశుసంవర్ధక శాఖ కూడా సీఎం వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌనరోదనను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందని అన్నారు. ఎమర్జెన్సీ మందులతో సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా 9 నెలలుగా నిలిచిపోయిందని హరీష్‌రావు అన్నారు.


పాలిచ్చే జీవులకు పొదుగు వాపు, గాలి కుంటు వ్యాధులు సోకితే ఒక్కో మూగ జీవిపై పాడి రైతులు రూ. 2 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇది వారికి అదనపు ఆర్థిక భారమవుతుందని చెప్పారు. మూగజీవాల్లో అంతర పరాన్న జీవులను నివారించేందుకు మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందని చెప్పారు. 9 నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు భాగాల్లో పరాన్న జీవులు చేరి రక్తహీనతకు గురి చేస్తున్నాయని హరీష్‌రావు అన్నారు.


రోగ నిరోధకశక్తి తగ్గి మూగజీవాలు బలహీనంగా మారుతున్నాయన్నారు. వ్యాధుల బారిన పడ్డ జీవులు ఆస్పత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వాహన ఉద్యోగులు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారని హరీష్‌రావు అన్నారు.


కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం మూగజీవుల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు కోరారు.

Updated Date - Aug 23 , 2024 | 02:43 PM