Share News

TG: తెలంగాణ చిహ్నంలో అమరుల స్థూపం పెడితే.. మీకెందుకు బాధ?

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:15 AM

‘‘ఉద్యమకారుల అభిప్రాయం మేరకు తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్థూపం పెడితే మీకెందుకు కడుపు నొప్పి?’’ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వ అడుగులు పడుతుంటే.. కేసీఆర్‌ కుటుంబం నానా యాగీ చేయాలని చూస్తుందన్నారు.

TG: తెలంగాణ చిహ్నంలో అమరుల స్థూపం పెడితే.. మీకెందుకు బాధ?

  • కీరవాణికి ఆస్కార్‌ వచ్చినప్పుడు.. కేసీఆర్‌, కేటీఆర్‌ అభినందించలేదా?

  • మహేష్‌ కుమార్‌ గౌడ్‌

  • సమ్మక్క, సారలమ్మలను చంపింది కాకతీయరాజులు కాదా?:బెల్లయ్యనాయక్‌

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యమకారుల అభిప్రాయం మేరకు తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్థూపం పెడితే మీకెందుకు కడుపు నొప్పి?’’ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు. నిజమైన తెలంగాణ వాదులు కోరుకున్న దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వ అడుగులు పడుతుంటే.. కేసీఆర్‌ కుటుంబం నానా యాగీ చేయాలని చూస్తుందన్నారు. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అమరుల స్థూపానికి రూ. వంద కోట్లు వెచ్చించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. అందులో ఒక్క అమరవీరుని పేరయినా చెక్కిందా అని ప్రశ్నించారు.


చిన జీయర్‌ స్వామిని తీసుకువచ్చి కుర్చీలో కూర్చోపెట్టినప్పుడు, అందెశ్రీ గీతాన్ని సీమాంధ్ర గాయకుడు రామకృష్ణతో పాడించినప్పుడు, ప్రభుత్వ అంబాసిడర్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మి, పుల్లెల గోపీచంద్‌లను నియమించినప్పుడు, రోజా ఇంటికి వెళ్లి ఆంధ్రా బిర్యానీని తిన్నప్పుడు, పనికిరాని ఒక ప్రాజెక్టును కట్టి.. దాని ప్రారంభోత్సవానికి ఏపీ సీఎంను ఆహ్వానించినప్పుడు, శారదాపీఠానికి తెలంగాణలో భూములు ఇచ్చినప్పుడు కేసీఆర్‌కు సెంటిమెంటు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కీరవాణికి ఆస్కార్‌ అవార్డు వస్తే.. ఇదే కేసీఆర్‌, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారని గుర్తు చేశారు. ఒక మంచి గీతానికి సంగీతం సమకూర్చేందుకు కీరవాణిని సంప్రదిస్తే.. నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. కీరవాణి ఎంపిక అన్నది అందెశ్రీ ఆలోచనేనని వెల్లడించారు.


మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం తెలంగాణ చిహ్నం ఎంపిక జరుగుతుందన్నారు. మల్లు రవి మాట్లాడుతూ 2023 ఎన్నికలకు ముందే.. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్‌రెడ్డి రాచరిక పాలన తీసేసి ప్రజా పాలన తీసుకువస్తామని చెప్పారని, అందులో భాగమే రాచరిక చిహ్నాల తీసివేతన్నారు. ప్రజా పాలనలో భాగంగానే జయజయహే తెలంగాణ పాటని అధికారిక గేయంగా చేస్తున్నట్లు చెప్పారు.‘‘తెలంగాణ చిహ్నంలో కాకతీయుల కళాతోరణం కావాలా...?అమరవీరుల స్థూపం వద్దా? సమ్మక్క, సారలమ్మలను చంపింది కాకతీయ రాజులు కాదా? నాతో సహా.. రాష్ట్రంలో 12ు ఉన్న గిరిజనులు కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు ఒప్పుకోవాలి?’’ అంటూ టీపీసీసీ ఆదివాసీ సెల్‌ ఛైర్మన్‌ బెల్లయ్య నాయక్‌ ప్రశ్నించారు. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గేయం విషయంలో దేశపతి శ్రీనివాస్‌, వి. ప్రకాష్‌ కోడిగుడ్లపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘‘అందెశ్రీ కాల్‌ రికార్డింగ్‌లను విడుదల చేస్తారా? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న ప్రైవేటు డిస్కషన్‌ రికార్డును ఎలా విడుదల చేస్తారు?’’ అంటూ ధ్వజమెత్తారు.

Updated Date - Jun 01 , 2024 | 04:15 AM