Share News

Congress: నకిరేకల్ మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. అవిశ్వాసంపై ఉత్కంఠత..!!

ABN , Publish Date - Aug 12 , 2024 | 09:45 AM

నకిరేకల్ మున్సిపాలిటీ కుర్చీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అవిశ్వాస అస్త్రంతో కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వడంతో నకిరేకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానున్నది. ఇందులో భాగంగానే ఈ మున్సిపాలిటీపై ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టి సారించారు.

Congress: నకిరేకల్ మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. అవిశ్వాసంపై ఉత్కంఠత..!!
Vemula Veeresham

నల్గొండ: నకిరేకల్ మున్సిపాలిటీ కుర్చీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అవిశ్వాస అస్త్రంతో కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వడంతో నకిరేకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానున్నది. ఇందులో భాగంగానే ఈ మున్సిపాలిటీపై ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టి సారించారు. ఈరోజు చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి 11 మంది, ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు నుంచి ఆరుగురు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు కౌన్సిలర్లుగా గెలుపొందారు.


క్యాంపు రాజకీయాలు..

సింహం గుర్తుపై గెలిచిన ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీపై గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. మొత్తం 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు చెప్పారు. నకిరేకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారుగా క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు. క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లు నేరుగా అవిశ్వాసానికి హాజరయ్యారు.


గతంలో ఏం జరిగిందంటే..?

కాగా.. గతంతో నకిరేకల్‌ మునిసిపాలిటీకి తొలి చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు బీఆర్‌ఎస్‌కే దక్కాయి. 19వ వార్డు నుంచి గెలిచిన రాచకొండ శ్రీనివాస్‌ చైర్మన్‌గా, 11వ వార్డు నుంచి గెలిచిన మురారిశెట్టి ఉమారాణి వైస్‌ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌కు చెందిన వార్డు కౌన్సిలర్లు 11మంది, ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీకి చెందిన ఆరుగురు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు, ఒక ఇండిపెండెంట్‌ హాజరయ్యారు. వీరితో పాటు ఎక్స్‌అఫీషియో ఓటు నమోదు చేసుకున్న బీఆర్‌ఎస్‌కు చెందిన అప్పటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కరీంనగర్‌ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మికాంతారావు హాజరయ్యారు.


సమావేశంలో తొలుత 20వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్నికకు సన్నద్ధమవుతుండగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయ ణ, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మికాంతారావు ఎక్స్‌ అఫీషియో ఓట్లు వేశారని, కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్‌ దైద స్వప్న, గాజుల సుకన్య అభ్యంతరం తెలపడంతో వీరిద్దరి ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక్కరి ఎక్స్‌ అఫీషియో ఓటు చెల్లుబాటవుతుందని అధికారులు ప్రకటించారు.


బీఆర్‌ఎస్‌కు చెందిన రాచకొండ శ్రీనివాస్‌ను చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్‌ రాచకొండ సునిల్‌ ప్రతిపాదించగా 17వ వార్డుకు చెందిన పల్లె విజయ్‌ బలపరిచారు. వైస్‌ చైర్‌పర్సన్‌గా మురారిశెట్టి ఉమారాణిని 10వ వార్డు కౌన్సిలర్‌ చౌగోని అఖిల ప్రతిపాదించగా, 14వ వార్డు కౌన్సిలర్‌ గడ్డం లక్ష్మినర్సింహస్వామి బలపర్చారు. చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌కు ఒకటి చొప్పున నామినేషన్లు రాగా, వీరిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌తో ప్రమాణస్వీకారం చేయించి, నియామక పత్రాలు అందజేశారు.

Updated Date - Aug 12 , 2024 | 10:38 AM