Delhi Bill: ఢిల్లీ బిల్లుపై అమీతుమీ

ABN , First Publish Date - 2023-08-07T02:41:22+05:30 IST

దేశ రాజధానిలో పరిపాలన సర్వీసులను నియంత్రించే అధికారాన్ని తన వద్దే పెట్టుకుంటూ కేంద్రం రూపొందించిన బిల్లు పార్టీలకు ప్రతిష్ఠాకరంగా మారింది....

Delhi Bill: ఢిల్లీ బిల్లుపై అమీతుమీ

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్డీయే, ఇండియా..

నేడు రాజ్యసభలో చర్చ

తప్పకుండా రావాలంటూ సభ్యులకు ‘త్రీ లైన్‌ విప్‌’ జారీ

చక్రాల కుర్చీల్లో రానున్న మన్మోహన్‌, శిబు సొరేన్‌

సర్కారుకు వైసీపీ, బీజేడీ మద్దతు

తెలుగుదేశం మద్దతూ అటేనా?

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధానిలో పరిపాలన సర్వీసులను నియంత్రించే అధికారాన్ని తన వద్దే పెట్టుకుంటూ కేంద్రం రూపొందించిన బిల్లు పార్టీలకు ప్రతిష్ఠాకరంగా మారింది. జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంత ప్రభుత్వ (సవరణ) బిల్లు (Delhi Bill) పేరుతో రూపొందించిన దీన్ని సోమవారం రాజ్యసభ(Rajya Sabha)లో చర్చకు రానుంది. దీనిపై మోదీ ప్రభుత్వాని(Modi Govt) కీ, ప్రతిపక్షాల ఇండియా కూటమి(India Alliance of Opposition)కీ మధ్య హోరాహోరీ పోరు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సభకు తప్పకుండా హాజరు కావాలని రెండు కూటముల్లోని పార్టీలు తమ సభ్యులకు ‘త్రీలైన్‌ విప్‌’ను జారీ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సభకు తప్పకుండా హాజరయి, పార్టీ నిర్ణయం మేరకు ఓటు వేయాలని సూచిస్తూ త్రీలైన్‌ విప్‌ జారీ చేస్తుంటారు. కాంగ్రెస్‌(Congress) సభ్యులకు ఆ పార్టీ చీఫ్‌ విప్‌ జైరాం రమేష్‌(Jairam Ramesh) త్రీలైన్‌ విప్‌ను జారీ చేశారు. అయితే సునాయాసంగా 128-130 ఓట్లు సంపాదించి బిల్లును ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేసినట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit Shah) రాజ్యసభలో ఈ బిల్లును మధ్యాహ్నం ప్రవేశపెట్టనున్నారని, సాయంత్రానికి ఓటింగ్‌ జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు అస్వస్థతతో ఉన్న 90 ఏళ్ల మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌(Manmohan Singh), 79 ఏళ్ల జార్ఖండ్‌ ముక్తిమోర్చా నాయకుడు శిబు సోరెన్‌(Shibu Soren) వీల్‌ చైర్‌లలో రానున్నారు. ఆసుపత్రిలో ఉన్న జేడీ(యూ)నేత వశిష్ట నారాయణ్‌ సింగ్‌ (Vashishta Narayan Singh) అంబులెన్స్‌లో చేరుకోనున్నారు.


ఎన్డీఏకు రాజ్యసభలో 111 మంది సభ్యులు ఉండ గా, ఇండియా కూటమికి 98 మంది ఉన్నారు. పైగా బీజేడీ, వైసీపీకి చెందిన 18 మంది సభ్యులతో పాటు మరో నలుగురైదుగురు తమకు మద్దతిస్తారని బీజేపీ విశ్వాసంతో ఉంది. ఇండియా కూటమిలోని 98 మందికి బీఆర్‌ఎ్‌సకు చెందిన ఏడుగురు సభ్యులు తోడయినా మొుత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 105 కంటే మించకపోవచ్చునని తెలుస్తోంది. రాజ్యసభ సంఖ్యాబలం 245 కాగా ఏడు సీట్లు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 238 మంది సభ్యులే ఉన్నారు. వీరిలో 120 మంది సభ్యుల మద్దతు లభిస్తే ఢిల్లీ బిల్లు నెగ్గుతుంది. ఎన్డీఏకు అవసరమైన దానికంటే 10, 12 మంది సభ్యుల మద్దతు ఎక్కువగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ తరుఫున ఎంపీలను సమీకరించే బాధ్యతను సీనియర్‌ నేత సీఎం రమేశ్‌కు అప్పజెప్పినట్లు సమాచారం.

వ్యూహరచనలో ఇండియా

ఇండియా కూటమికి చెందిన పార్టీల సభాపక్ష నేతలు సోమవారం ఉదయం 11గంటలకు సమావేశమై బిల్లుపై వ్యూహరచన చేయనున్నారు.

Updated Date - 2023-08-07T03:58:21+05:30 IST