Share News

Nara Lokesh: నాణ్యమైన విద్యాబోధనపై మంత్రి లోకేష్ కీలక నిర్ణయాలు..!!

ABN , Publish Date - Aug 09 , 2024 | 08:55 PM

ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరం మోడల్ పీటీఎం సమావేశాలకు హాజరవుతామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Nara Lokesh: నాణ్యమైన విద్యాబోధనపై మంత్రి లోకేష్ కీలక నిర్ణయాలు..!!
Minister Nara Lokesh

అమరావతి: నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆదేశించారు. రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫార్మేషన్ “సాల్ట్” ప్రాజెక్టు అమలు తీరుపై శుక్రవారం నాడు పాఠశాల విద్య అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సమావేశంలో అధికారులతో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠాశాలల్లో మెరుగైన విద్యను కల్పించాలని.. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

lokesh-43.jpg


పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పని సరి..

ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని సూచించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరం మోడల్ పీటీఎం సమావేశాలకు హాజరవుతామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం వేలకోట్లు వెచ్చిస్తే 2లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా తగ్గారు? అని ప్రశ్నించారు. బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు రావాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

lokesh-44.jpg


జగన్ ప్రభుత్వంలో విధ్వంసం: మంత్రి టీజీ భ‌ర‌త్

మరోవైపు.. జగన్ ప్రభుత్వంలో విధ్వంసం తప్పితే.. అభివృద్ధి జాడ లేదని ఆంధ్రప్రదేశ్ ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ (Minister TG Bharath) ఆరోపించారు. ఓర్వకల్లు ఇండ‌స్ట్రీయ‌ల్ హ‌బ్‌లో ప‌రిశ్రమ‌ల స్థాప‌న‌కు కృషి చేస్తున్నామని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డితో క‌లిసి ఓర్వకల్లు ఇండ‌స్ట్రీయ‌ల్ హ‌బ్‌ను మంత్రి భ‌ర‌త్ శుక్రవారం నాడు ప‌రిశీలించారు. జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని సంద‌ర్శించి యాజ‌మాన్యం, ప‌రిశ్రమ‌ల శాఖ‌ అధికారుల‌తో మంత్రి స‌మావేశం అయ్యారు. ఎయిర్‌పోర్టు స‌మీపంలో టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో సీఎం చంద్రబాబు ఇండ‌స్ట్రీయ‌ల్ జోన్‌కు శంకుస్థాప‌న చేసిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు.


ఏపీలో పెట్టుబ‌డులు..

నీరు, విద్యుత్, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్పనపై ఏపీఐఐసీ అధికారుల‌తో చ‌ర్చించారు. జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని సంద‌ర్శించి ఫ్యాక్టరీ యాజ‌మాన్యం, ఏపీఐఐసీ అధికారుల‌తో స‌మీక్షించారు. జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది వ్యక్తులు విజయవాడలో అంబేద్కర్ శిలాఫ‌ల‌కాన్ని ధ్వంసం చేయ‌డాన్ని మంత్రి భరత్ ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిపోయిన ప‌రిశ్రమ‌లు మ‌ళ్లీ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తిగా ఉన్నాయని వివరించారు. గ‌డిచిన ఐదేళ్లలో విధ్వంసం త‌ప్ప జ‌రిగిందేమీ లేదని విమర్శించారు. త‌మ ప్రభుత్వం అభివృద్ధే మంత్రంగా ముందుకు వెళుతోందని మంత్రి భరత్ ఉద్ఘాటించారు.


వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు వెళ్లిపోయాయి..

వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో ఎన్నో ఇబ్బందులను జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజ‌మాన్యం ఎదుర్కొందని గుర్తుచేశారు. మ‌ళ్లీ టీడీపీ ప్రభుత్వం రావ‌డంతో ఇప్పుడున్న ఫ్యాక్టీరీని మ‌రింత విస్తరించేందుకు ముందుకు వస్తోందని తెలిపారు. గ‌డిచిన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ స‌హ‌కారం లేక‌పోవ‌డంతో జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం నెమ్మదిగా సాగిందని చెప్పారు. ప్రభుత్వం త‌రుపున ఫ్యాక్టరీకి అందించాల్సిన విద్యుత్, వాట‌ర్, రైల్వే సైడింగ్స్ ఏదీ గ‌త ప్రభుత్వం చేయలేదన్నారు. జగన్ ప్రభుత్వ హ‌యాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఓ ప‌రిశ్రమ చెన్నైలో రూ.3 వేల కోట్లతో ప్లాంటును ఇప్పుడు న‌డుపుతుందని చెప్పారు. మ‌ళ్లీ ఏపీకి రావ‌డానికి వారు ఆస‌క్తిగా ఉన్నారని మంత్రి భరత్ అన్నారు.


ఓర్వకల్లు రెడ్ జోన్‌లో ఉండటంతో..

కేంద్ర ప్రభుత్వం సైతం ఓర్వకల్లు ఇండ‌స్ట్రీయ‌ల్ జోన్‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్పన‌కు రూ.1800 కోట్లు ఇస్తున్నట్లు తెలిపిందని అన్నారు. శ్రీ సిటీ గ్రీన్ జోన్‌లో ఉంద‌ని, ఓర్వకల్లు రెడ్ జోన్‌లో ఉండ‌టంతో ఎలాంటి ప‌రిశ్రమ‌లైనా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చని వివరించారు. ఇలాంటి చోట మౌలిక స‌దుపాయాలు బాగా క‌ల్పిస్తే ఓర్వక‌ల్లులో ప‌రిశ్రమ‌లు భారీగా ఏర్పాట‌య్యేందుకు అవ‌కాశం ఉంటుందని తెలిపారు. అందుకే బెస్ట్ క‌న్సల్టెన్సీతో మాట్లాడి ఇండ‌స్ట్రీయ‌ల్ జోన్‌లో స‌మ‌స్యలేమైనా ఉంటే గుర్తించి స‌రిచేసుకుంటామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.


త్వరలోనే విజయవాడకు విమాన సర్వీసులు..

జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజ‌మాన్యం స‌మస్యల‌ను ప‌రిష్కరిస్తామని అన్నారు. త‌మ ప్రభుత్వం మ‌రో రెండు ద‌శాబ్దాల పాటు కొన‌సాగుతుందని ఉద్ఘాటించారు. పారిశ్రామిక‌వేత్తలు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఓర్వక‌ల్లు ఇండ‌స్ట్రీయ‌ల్ జోన్‌లో పెట్టుబ‌డులు ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే వ‌స్తాయని చెప్పారు. ఇక్కడ నీరు, విద్యుత్, రోడ్డు, రైల్వే లైన్ ఇత‌ర స‌మ‌స్యల‌న్నీ ప‌రిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 09:16 PM